Team of the Tournament : మొన్ననే టీ 20 టీమ్ ని ప్రకటించిన ఐసీసీ, ఆ జట్టుకి సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా చేసింది. ఇప్పుడు వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023ని ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మని కెప్టెన్ చేసింది. అంతేకాదు వన్డే జట్టులో మరో ఐదుగురు ఇండియన్ ప్లేయర్లకు అవకాశం కల్పించింది. దీంతో టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రపంచ ద్రష్టిలో ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో ఐసీసీ ప్రకటిస్తున్న టీమ్ లని చూస్తే తెలుస్తోందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.
ఇక రోహిత్ తో పాటు ఎంపికైన వారెవరంటే.. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. వీరు కాకుండా స్పిన్నర్ గా ఆస్ట్రేలియా నుంచి ఆడమ్ జంపా, ఇంకా వన్ డౌన్ లో ట్రావిస్ హెడ్ ఎంపికయ్యారు. న్యూజిలాండ్ నుంచి డారిల్ మిచెల్, సౌతాఫ్రికా నుంచి హెన్రిచ్ క్లాసెన్ లను ఐసీసీ ఎంపిక చేసింది. ఆల్ రౌండర్ గా సౌతాఫ్రికా ప్లేయర్ మార్కో జాన్సన్ ఎంపికయ్యాడు.
ఐసీసీ వన్డే జట్టును చూస్తుంటే, టీమ్ ఇండియా జట్టులో ప్రపంచంలో మేటి అయిన ఆటగాళ్లున్నారని చెప్పాలి. అయితే వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓడినప్పటికి ఐసీసీ కెప్టెన్ గా రోహిత్ శర్మ వైపే ఐసీసీ తన ఓటు వేసింది. అయితే ప్రపంచ కప్ గెలిపించిన కమిన్స్ ని పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాదు ఆటగాడిగా కూడా అవకాశం కల్పించలేదు.
ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే వరల్డ్ కప్ ఫైనల్కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేసిందంటే తను ఒక వరల్డ్ కప్ ఎలెవన్ జట్టును ప్రకటించింది. అందులో రోహిత్ ను కాదని కోహ్లిని కెప్టెన్ చేసింది. అలా రోహిత్ను మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది.
తీరా ఇప్పుడు చూస్తే.. సాక్షాత్తూ ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ లో.. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేడు. ఇదీ టిట్ ఫర్ టాట్ అంటే అని నెట్టింట రోహిత్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అందుకే చెరపకురా చెడేవు అని ఊరికే అనరని కూడా అంటున్నారు.