Vande Bharat Train Chennai To Mysore : దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ సోమవారం ప్రారంభమైంది. చెన్నై నుంచి మైసూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభం అయింది. దేశంలో 5వ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 11వ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ -కాన్పూర్- అలహాబాద్-వారణాసి మార్గంలో మొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులు కేంద్రం జాతికి అంకితం చేస్తోంది. దేశంలో నలుమూలలను కలిపేలా 75 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతామని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై ప్రకటించారు. స్పీడ్, సేఫ్టీ, సర్వీసులతో కూడిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలను చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే ఉత్పత్తి యూనిట్ తయారు చేసింది.
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు కొత్త ప్రయాణ అనుభూతిని ఇస్తున్నాయి. ఈ రైళ్లతో ప్రయాణ కాలం సగానికి పైగా తగ్గింది. ఈ రైలు బోగీల్లో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ బేస్ డ్ ఆడియో, విజువల్ ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, వైఫై, అనుకూల సీటింగ్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛైర్లు, బయోవ్యాక్యూమ్ టాయ్ లెట్లు సదుపాయాలు కల్పించారు. పాంట్రీతోపాటు వేడి వేడి భోజనం, చల్లటి శీతల పానీయాలను ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేశారు.వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో 1128 మంది ప్రయాణికులు కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేశారు.