Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్(Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)కు అడుగడుగునా ఆటంకాలు కలుగుతున్నాయి. తాజాగా మరోసారి అస్సాంలో మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గౌహతిలోకి రాకుండా నిలువరించారు. సరిహద్దుల వద్ద బారికేడ్లు పెట్టారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సోమవారం మధ్యాహ్నం తర్వాత రాహుల్ గాంధీ అస్సాం నుంచి నాగాలాండ్లోకి ప్రవేశించారు. అయితే తిరిగి మంగళవారం ఉదయం ఇరు రాష్ట్రాల సరిహద్దుకు చేరుకున్నారు. స్థానిక యువతతో ముచ్చటించారు. అక్కడి నుంచి గౌహతికి బయల్దేరారు. యాత్ర రూట్ మార్చుకోవాలని అంతకుముందు అస్సాం సర్కార్ ఆదేశించింది. ట్రాఫిక్ కారణాల వల్ల గౌహతిలో యాత్రకు అనుమతించడం లేదని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. సిటీ బైపాస్ మీదుగా వెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా గౌహతికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బారికేడ్లను దాటుకుని కార్యకర్తలు దూసుకొచ్చారు. ఆ సమయంలో రాహుల్ అక్కడే ఉన్నారు.ఈ ఘటనపై రాహుల్ ఘాటుగా స్పందించారు. ఇదే మార్గంలో బజ్రంగ్ దళ్ యాత్ర చేపట్టిందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీ నిర్వహించారని గుర్తు చేశారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం బారికేడ్లు పెట్టారని మండిపడ్డారు. తాను చట్టాన్ని అతిక్రమించలేదన్నారు.
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత కౌంటర్ ఎటాక్ దిగారు. రాహుల్పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇది తమ సంస్కృతి కాదు.. శాంతియుత రాష్ట్రమని పేర్కొన్నారు. నక్సలైట్ వ్యూహాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకే కేసు నమోదు చేయాలని ఆదేశించానన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలనే సాక్ష్యాలుగా పరిగణించాలని పోలీసులకు సూచించానన్నారు.
సోమవారం కూడా రాహుల్ యాత్రలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆయనను ప్రముఖ వైష్ణవ సాధువు శ్రీమంత్ శంకర్దేవ జన్మస్థలి బతద్రవ సత్రను దర్శించుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. అలాగ మేఘాలయలో యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ ముచ్చటించేందుకు అక్కడ అనుమతులు ఇవ్వలేదు.