Valery Gerasimov : ఉక్రెయిన్లో రష్యా యుద్ధ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్న టాప్ జనరల్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరి గెరాసిమోవ్ ఆచూకీ తెలియడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆయన మీడియాలోనూ కనిపించింది లేదు. రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో గెరాసిమోవ్ మరణించారనేది విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిపై క్రెమ్లిన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోషల్ మీడియాలో మరిన్ని వదంతులకు రెక్కలొస్తున్నాయి.
క్రిమియాలో రష్యా స్థావరాలపై ఈ నెల 4న ఉక్రెయిన్ రెండు దాడులు చేసింది. యెవ్పటోరియా నగర సమీపంలో ఉన్న మిలిటరీ యూనిట్, సెవాస్తొపొల్ వద్ద ఉన్న మిలటరీ కమాండ్ పోస్టుపై ఈ దాడులు జరిగాయి. ఆ సమయంలో సెవాస్తొపొల్ పోస్టు వద్ద గెరాసిమోవ్ ఉన్నారని, ఉక్రెయిన్ జరిపిన ఆ దాడిలో చనిపోయారంటూ ధ్రువీకరించని వార్తలు అప్పటి నుంచి ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన పోస్టులు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫాం ‘ఎక్స్’తో పాటు టెలిగ్రామ్లో చక్కర్లు కొడుతున్నాయి.
గెరాసిమోవ్ మరణాన్ని ధ్రువీకరించే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నప్పటికీ.. దాదాపు మూడువారాలుగా క్రెమ్లిన్ మౌనం వహించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెరాసిమోవ్ చివరిసారిగా గత నెల 29న ఓ ప్రభుత్వ కార్యక్రమంలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడా, ఎవరికీ కనిపించలేదు.
గతంలో నల్లసముద్రంలో నౌకాస్థావరంపై జరిగిన మిసైల్ దాడిలో అడ్మిరల్ విక్టర్ సొకొలోవ్ మరణించారంటూ వార్తలు వెలువడితే.. వెంటనే ఉన్నతాధికారులు ఖండించారు. కానీ గెరాసిమోవ్ విషయంలో ఎన్ని వదంతులున్నా.. క్రెమ్లిన్ నోరు మెదపకపోవడమే అనుమానాలకు ఊతమిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే గెరాసిమోవ్కు సంబంధించి నిరుడు కూడా ఇలాంటి సస్పెన్సే కొంతకాలం కొనసాగింది. గత జూన్లో వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగాజిన్ విఫల తిరుగుబాటు అనంతరం గెరాసిమోవ్ కనిపించకుండాపోయారు. అనంతరం కొద్ది కాలానికి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడూ అలాగే జరిగే అవకాశాలు లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.