New Born Babies : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముగ్ధమనోహర రూపంలో బాలరాముడు.. అందరినీ ఆకర్షిస్తున్నాడు. సరిగ్గా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయానికే కొందరు గర్భిణులు.. ప్రసవం జరగాలని కలలు కన్నారు. ఈ మేరకు ముందుగానే సిజేరియన్లకు రెడీ అయ్యారు. కోరుకున్నట్లుగానే.. ప్రాణప్రతిష్ఠ జరిగిన దివ్యముహూర్తంలోనే బిడ్డల్ని కని.. ఆ బుజ్జాయిల ముఖాలను చూసి సాక్షాత్తూ ఆ శ్రీరాముడే తమ ఇంట పుట్టాడని మురిసిపోయారు.
అభిజిత్ లగ్నంలో పెట్టిన దివ్యముహూర్తంలో పుట్టిన మగబిడ్డలకు రామ్ అని, ఆడపిల్లలకు సీత అని పేర్లు పెట్టుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఫర్జానా అనే ముస్లింమహిళ.. తన బిడ్డకు రామ్ రహీమ్ అని పేరుపెట్టింది.
ఇదిలా ఉంటే.. జనవరి 22న నిశ్చయించిన ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలో బీహార్ లోని పట్నాలో ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో ఏకంగా 500 మంది తల్లులకు ప్రసవం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మధ్యప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో వివిధ ఆస్పత్రుల్లో సోమవారం 47 మంది జన్మించినట్లు సమాచారం. యూపీలోని కాన్పుర్ గణేశ్ శంకర్ ఆస్పత్రిలో 25 మందికి కాన్పులు జరిగినట్లు వైద్యులు తెలిపారు. చాలామంది తమ బిడ్డలకు రామ్, రాఘవ్, రాఘవేంద్ర, రఘు, రామేంద్ర వంటి పేర్లు పెట్టుకున్నారు. ఇక కర్ణాటక విజయపురలో జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం 20 మందికిపైగా మహిళలకు కాన్పులు జరిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు.