Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ‘గుంటూరు కారం’. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. ఇక ఈ మూవీ తర్వాత మహేశ్ నటించబోయే తదుపరి సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళితో మహేశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.
అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా మహేశ్ సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా జర్మనీ వెళ్లాడు. అక్కడ ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో శారీరక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని మహేశ్ బాబు తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఓ అడ్వంచరస్ కథతో ఈ సినిమా సాగుతుంది. అందువల్ల ఇందులో సాహసాలతో కూడిన ఎన్నో సన్నివేశాలు ఉండనుండటంతో నటులు శారీరకంగా ఎదురయ్యే సవాళ్లకి సిద్ధం కావాల్సిందే. ఇందులో భాగంగానే మహేశ్ జర్మనీ వెళ్లాడు. ఇకపోతే ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణుల్ని సెలెక్ట్ చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.