YSRCP latest news today(Andhra politics news) :
వైసీపీ అధిష్టానానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, నరసరావుపేట ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. పల్నాడు ప్రజలు తననెంతో ఆదరించారని, వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేశానని తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావించిందని, అందుకు బాధ్యత తనది కాదని శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. కాగా.. ఎంపీని కలిసేందుకు పల్నాడు ఎమ్మెల్యేలు ఆయన నివాసానికి బయల్దేరగా.. ఇంతలోనే ఆయన రాజీనామా ప్రకటన చేశారు. కొద్దిరోజులుగా వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చనున్నట్లు వార్తలొచ్చాయి. దాంతో ఆ ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. గుంటూరు నుంచి బరిలోకి దిగాలని శ్రీకృష్ణ దేవరాయలకు అధిష్టానం సూచించింది. కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు.