అయోధ్యలో బాలరాముడి దర్శనానికి రామభక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే క్యూ కట్టారు. అయోధ్య నగర వీధులు భక్తులతో కిటకిటలాడాయి. నిన్న ప్రాణ ప్రతిష్ట జరగ్గా.. ఇవాళ తెల్లవారు జామున ఆ మర్యాద పురుషోత్తమునికి తొలి పూజ నిర్వహించారు. స్వామి వారికి హారతి ఇచ్చారు. సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు.
అయోధ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ నెలకొంది. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిన్న స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు VIPల తాకిడి కారణంగా దర్శనం చేసుకోలేకపోయారు. వారంతా మంగళవారం రామయ్య దర్శనానికి పోటెత్తారు. మొత్తంగా అయోధ్యాపురి జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముడికి భవ్య మందిరం ఏర్పాటయింది. కోవెలలో బాలరాముడి విగ్రహం సామాన్యులకు దర్శనమిస్తోంది. గర్భగుడిలో నీలమేఘశ్యాముడు కొలువయ్యాడు. బాలరాముడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, హిందువులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది బాలరాముని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈమేరకు ఏర్పాట్లు చేశాయి. రైల్వే స్టేషన్ను ఆధునికీకరించడంతో పాటు.. కొత్తగా ఎయిర్పోర్టును సైతం అందుబాటులోకి తెచ్చారు. ఎన్ని వేల మంది వచ్చినా, వెళ్లినా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేసారు.
దేశంలో కొత్త పర్యాటక కేంద్రంగా అయోధ్య మారనుంది. ఏడాదికి 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరుగుతాయని, రాబడి కూడా అదే రేంజ్లో ఉంటుందని భావిస్తున్నారు. వచ్చిన ప్రయాణికులు కేవలం అయోధ్యకే పరిమితం కాకపోవచ్చు. అటు వారణాసి, ఇటు బుద్ధగయ వంటి ప్రాంతాలను కూడా సందర్శించే వీలుంది. ఫలితంగా అటు హోటళ్లు, ట్రావెల్ అనుబంధ రంగాలకు మేలు జరుగుతుంది. భారత టూరిజానికి ప్రత్యేకించి ఆధ్యాత్మిక పర్యాటకానికి అయోధ్య నూతన మోడల్ గా మారనుంది.
.
.