500 Year Ayodhya Timeline : సరియు నది తీరాన ఉన్నది అయోధ్య నగరం. అయోధ్య అంటే ఎన్నో కథలు, కావ్యాల నగరం. ఈ నగరంలోనే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు జన్మించాడని జనులందరి అపార నమ్మకం. ఆదికవి వాల్మీకి, కవితులసిదాస్ రచనలలో అయోధ్య పవిత్ర భూమిపై రాముడు జన్మించాడని ఉంది. అలాగే ఈ నగరంలో ఎన్నో యుద్దాలు, కుట్రలు జరిగాయని చరిత్ర చెబుతోంది.
సరియు నది తీరాన ఉన్నది అయోధ్య నగరం. అయోధ్య అంటే ఎన్నో కథలు, కావ్యాల నగరం. ఈ నగరంలోనే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు జన్మించాడని జనులందరి అపార నమ్మకం. ఆదికవి వాల్మీకి, కవితులసిదాస్ రచనలలో అయోధ్య పవిత్ర భూమిపై రాముడు జన్మించాడని ఉంది. అలాగే ఈ నగరంలో ఎన్నో యుద్దాలు, కుట్రలు జరిగాయని చరిత్ర చెబుతోంది.
ఇదంతా పుస్తకాలు, గ్రంథాలలో ఉన్న కథలు. కానీ రాముడి పాలన ముగిశాక.. తరువాత అయోధ్యలో ఏం జరిగిందనేది తెలుసుకోవాలనే ఆత్రుత అందరిలో ఉంటుంది. మరీ అన్ని వేల సంవత్సరాల అయోధ్య చరిత్ర అందుబాటులో లేదుకానీ.. 500 ఏళ్ల క్రితం మొదలైన రామ జన్మ భూమి సంఘర్షణ గురించి అందరూ తెలుసుకోవాలి.
1528 – బాబ్రీ మసీదు నిర్మాణం
దాదాపు 500 ఏళ్ల క్రితం అంటే 1528లో ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రదేశంలో.. బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది. భారతదేశంలో మొదటి మొఘల్ రాజు అయిన బాబర్ వద్ద సేనాపతి హోదాలో ఉన్న
మీర్ బఖీ ఈ మసీదు నిర్మించాడు. తన రాజభక్తికి నిదర్శనంగా మసీదుకి బాబ్రీ మస్జిద్ అని పేరు పెట్టాడు. అయితే ఈ మసీదు నిర్మించిన ప్రదేశంలో ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదని.. దాని శిథిలాలపై బాబ్రీ మసీదు నిర్మించారని కొందరు హిందూ మతపెద్దలు వాదించడంతో హిందువులు, ముస్లింల మధ్య వివాదం మొదలైంది.
1600 – మసీదు ప్రాంగణలో హిందువుల పూజలు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన మొఘల్ చక్రవర్తి అక్బర్.. హిందువులకు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు అనుమతించారు.
1751 – మరాఠాల రాజ్యం
మొఘట్ చక్రవర్తి ఔరంగజేబు మరణం తరువాత భారతదేశంలో కొంత కాలం మరాఠా రాజులు పాలన చేశారు. ఆ సమయంలో హిందువుల పుణ్య క్షేత్రాలైన అయోధ్య, కాశీ, మథురా నగరాలను వారు తమ ఆధీనంలో తీసుకున్నారు.
1853-1859 మత కలహాల ఆరంభం
అయోధ్య భూమిపై తమకే హక్కుందని హిందువులు, ముస్లింల మధ్య తొలిసారి 1853లో గొడవలు జరిగాయి. దీంతో అప్పటి బ్రిటీష్ పాలకులు మసీదు చుట్టూ కంచెలు వేసి.. బయట ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకోవాలని చెప్పారు. 1858లో నిహంగ్ సిక్కులు బాబ్రీ మసీదు ఉన్న చోటనే భగవాన్ శ్రీ రాముడు జన్నించాడని ప్రచారం చేశారు. నిహంగ్ సిక్కుల గురువు నిహంగ్ బాబా ఫకీర్ సింగ్ ఖల్సా మరో 25 సిక్కులు బాబ్రీ మసీదు ప్రాంగణంలో బలవంతంగా వెళ్లారు. ఇది రామ జన్మ భూమి అని చెప్పారు.
1885- రామ మందిరం కట్టాలని కోర్టులో కేసు
అయోధ్యలోని నిర్మోహి అఖాడా పూజారి రఘుబర్ దాస్ 1885లో కోర్టులో దావా వేశారు. మసీదు బయట ప్రాంగణంలో రామ మందిరం నిర్మించేందుకు అనుమతివ్వాలని కోర్టుని కోరారు. కానీ కోర్టు అందుకు అనుమతించలేదు. అలా మసీదు బయట ప్రాంగణంలో హిందువులు 90 ఏళ్లుగా పూజలు చేస్తూనే ఉన్నారు.
1949 – మసీదులో బాల రాముడి విగ్రహాలు
డిసెంబర్ 21,1949 అర్ధరాత్రి కొందరు హిందువులు మసీదు లోపల బాల రాముడి విగ్రహాలు పెట్టారు. దీంతో హిందువులు, ముస్లింల మధ్య మరోసారి గొడవలు జరిగాయి. ఇరు వర్గాలు స్థలం యజమాన్య హక్కుల కోసం కోర్టుకు వెళ్లాయి. మసీదుకి తాళాలు వేశారు. హిందువుల కూడా ప్రార్థనలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.
1950-1959: కోర్టులో పెరిగిన అయోధ్య భూమి కేసులు
ఈ కాలంలో వివాదాస్పద భూమి తమదే అంటూ నిర్మోహి అఖాడా కోర్టులో కేసు వేసింది. మరోవైపు ఈ స్థలం ముస్లిం ప్రార్థనా స్థలం కాబట్టి దీనిపై తమకు యజమాన్య హక్కులున్నాయని సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో దావా వేసింది. ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ చట్టపరంగా పరిష్కారం జరగలేదు.
1986-1989: తెరుచుకున్న మసీదు తాళాలు
1986లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం బాబ్రీ మసీదు తాళాలు తెరవాలని ఆదేశించింది. హిందువుల కూడా మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకోవాలని చెప్పింది. ఈ సమయంలోనే రామ జన్మభూమి అనే ఉద్యమం మొదలైంది. ఉద్యమాన్ని ప్రారంభించింది జన్ సంఘ్ పార్టీ.
1990 : రామ జన్మభూమిలో గుడి కట్టాలని డిమాండ్
1990లో విశ్వ హిందూ పరిషద్ వివాదాస్పద అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముడి దేవాలయం(రామ్ లలా మందిర్- రామ్ మందిర్) నిర్మించాలని పిలుపునిచ్చింది. ఇదే సంవత్సరంలో బిజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీ రామ జన్మభూమి అంటూ రథ యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో బాబ్రీ మసీదు కూలగొట్టాలని విఫల ప్రయత్నం చేశారు.
1992: బాబ్రీ మసీదు కూల్చివేత
రామ జన్మ భూమి వివాదంలో సుప్రీం కోర్టు ముస్లింలకు అభయమిచ్చినప్పటికీ, కొందరు హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదుని కూల్చివేశారు. ఈ ఘటన భారత రాజకీయాలలో సంచలనం సృష్టించింది.
1993-1994: మసీదు కూల్చివేతతో అల్లర్లు
బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత దేశంలోని పలు ప్రాంతాలలో మతపరమైన ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. చాలా మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది.
అల్లర్ల కారణంగా అప్పటి ప్రధాన మంత్రి పివి నరసింహా రావు ప్రభుత్వం మసీదు, చుట్టు పక్కల భూమిని ఆధీనంలోకి తీసుకుంది. డాక్టర్ ఇస్మాయిల్ ఫరూకీ సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేసినప్పటికీ.. 1994లో కోర్టు ఆ కేసుని కొట్టివేసింది.
2002-2003 : మసీదు ప్రాంతంలో తవ్వకాలు.. అలహాబాద్ హైకోర్టు తీర్పు
అలహాబాద్ హైకోర్టు తీర్పు బాబ్రీ మసీదు, రామ జన్మ భూమి యజమాన్య హక్కు కేసుపై 2002లో విచారణ చేపట్టింది. పురాతత్వ శాఖ(Archaeological Survey of India) మసీదు ప్రాంతంలో తవ్వకాలు చేసింది. మసీదు కింద హిందూ దేవాలయం ఉందనే వాదనలు రావడంతో కోర్టు ఈ తవ్వకాలు చేయాలని ఆదేశించింది.
2009-10: లిబర్హాన్ కమిషన్ నివేదిక
బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ 16 సంవత్సరాలపాటు సాగింది. ఈ విచారణ చేపట్టిన లిబర్హాన్ కమిషన్ 399 సార్లు విచారణను వాయిదా వేస్తూ చివరికి ఈ ఘటన వెనుక ఉన్న కొందరు రాజకీయ నాయకుల పేర్లను నివేదికలో తెలిపింది.
బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక బిజేపీ నాయకులైన లాల్ కృష్ణ అడ్వాణీ, అటల్ బిహారీ వాజ్పేయి, మరి కొందరు పార్టీ నాయకులున్నారని లిబర్హాన్ కమిషన్ తన విచారణలో తేల్చింది.
2010 : అలహాబాద్ హైకోర్టు తీర్పు
2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు బాబ్రీ మసీదు, చుట్టు ప్రాంగణం భూమిని మూడు భాగాలుగా విభజన చేసింది. ఆ మూడు భాగాలలో ఒక భాగం హిందువులకు, ఒక భాగం ముస్లింలకు, ఒక భాగం నిర్మోహి అఖాడాకు కేటాయించింది. కానీ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టుకి మళ్లీ కేసు వెళ్లింది.
2019: సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు
2019లో రామ జన్మ భూమి – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్టు తన తీర్పుని వెలువరించింది. ఆ భూమి హిందువులకు కేటాయిస్తూ.. అక్కడ శ్రీ రాముడికి ఒక భవ్య దేవాలయం నిర్మించాలని ఆదేశించింది. మరోవైపు ముస్లింలు మరో చోట మసీదు నిర్మించుకునేందుకు 5 ఎకరాల భూమిని కేటాయించింది.
2020: అయోధ్య రామ మందిర శంకు స్థాపన
2020 ఆగస్టు 5న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేవాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.
2021: బాబ్రీ మసీదు శంకు స్థాపన
2021 జనవరి 26న అయోధ్యలోని ధన్నీపూర్ వద్ద బాబ్రీ మసీదు నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. ఈ కొత్త మసీదు అయోధ్య రామ మందిరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనవరి 26న రిపబ్లిక్ డే అంటే భారతదేశ రాజ్యాంగం అవతరించిన రోజు సందర్భంగా మసీదు శంకుస్థాపన చేశామని మసీదు కమిటీ సభ్యులు తెలిపారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మసీదు నిర్మాణం జరుగుతోంది. ఈ కొత్త బాబ్రీ మసీదు పాత మసీదు కంటే చాలా పెద్దది. మసీదుతో పాటు, ఒక అత్యాధునిక హాస్పిటల్, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒక లైబ్రరీ, ఒక కమ్మూనిటి కిచెన్ కూడా మసీదు ప్రాంగణంలో నిర్మిస్తామని కమిటీ సభ్యులన్నారు.
2024: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట
2024 జనవరి 22న అయోధ్య రామజన్మభూమిపై భవ్య దేవాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు.