Chinese Spy Balloon : చైనా బెలూన్లు మరోసారి కలకలానికి దారితీశాయి. మొత్తం ఆరు చైనా బెలూన్లను గుర్తించామని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తైవాన్ జలసంధి మీదుగా వచ్చి తమ దేశ భూభాగాన్ని దాటాయని పేర్కొంది. నెలన్నర రోజులుగా చైనా బెలూన్ల పరంపరలో ఇది తాజాది అని వివరించింది.
తైవాన్ జలసంధి వద్ద ఉన్న మీడియన్ లైన్(డేవిస్ లైన్)ను నిత్యం చైనా ఫైటర్ జెట్లు, డ్రోన్లు క్రాస్ చేస్తుంటాయి. ఇప్పుడు ఈ జాబితాలో బెలూన్లు చేరాయి. నిఘా కార్యకలాపాల కోసం డ్రాగన్ దేశం వీటిని వినియోగిస్తున్నట్టు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో తమ గగనతలంలోకి ప్రవేశించిన చైనా నిఘా బెలూన్ను అమెరికా పేల్చివేసింది. అయితే పౌర, వాతావరణ అవసరాల కోసం వాటిని ఎగరేస్తున్నట్టు చైనా చెప్పినా.. ఎవరూ పెద్దగా విశ్వసించలేదు.
దక్షిణ చైనా సముద్రంలో గత 24 గంటల్లో చైనా సైనిక కార్యకలాపాలు ముమ్మరమయ్యాయమని తైవాన్ ఆరోపించింది. ఆరు బెలూన్లు డేవిస్ లైన్ దాటి వచ్చాయని.. వాటిలో ఒకటి తమ భూభాగం మీదుగా పయనించిందని తైవాన్ రక్షణ శాఖ అధికారులు చెప్పారు. బెలూన్లన్నీ తూర్పు దిశగా పయనించి.. అంతర్థానమయ్యాయని వివరించారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో 4 చైనా యుద్ధ విమానాలు, 4 యుద్ధ నౌకల కదలికలను సైతం గుర్తించామన్నారు.
కీలంగ్ రేవుకు అత్యంత సమీపం నుంచి బెలూన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. తైవాన్ కీలక నౌకా స్థావరం ఉన్నది ఇక్కడే. అయితే డేవిస్ లైన్ను చైనా అధికారికంగా గుర్తించడం లేదు. డ్రాగన్ దేశం పోకడలను వ్యతిరేకించే డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వరుసగా మూడో సారి తైవాన్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.