Jai Hanuman: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని ఘన విజయం అందుకుంది. కేవలం రూ.45 కోట్లతో తెరకెక్కి.. భారీ కలెక్షన్లను నమోదు చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూళు చేసిందని అంటున్నారు. అయితే ఈ మూవీకి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు.
దీనికి సంబంధించి ప్రశాంత్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ మూవీ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్’ మూవీ ఉండనుందని అన్నారు. అయితే ఈ సీక్వెల్ మూవీలో తేజ సజ్జా హీరో కాదని చెప్పారు. ఈ సీక్వెల్లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని.. కానీ ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి అని అన్నారు. అయితే ఆ పాత్రను ఓ స్టార్ హీరో చేస్తారని తెలిపారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరనేది వెల్లడించలేదు. ఈ సినిమా 2025లో రిలీజ్ కానుందంటూ చెప్పారు. ఈ సినిమా కంటే ముందు తన నుంచి ‘అధీర’, ‘మహాకాళి’ టైటిల్తో రెండు సినిమాలు రానున్నాయని అన్నారు. ఈ అప్డేట్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.