Ayodhya Ram Mandir : భారతదేశమంతా రామనామంతో మార్మోగింది. దేశంలో రాముడు లేని గ్రామంలేదంటే అతిశయోక్తి కాదు. ఆ గ్రామం అనే పేరులోనే రామం ఉంది. అంతటి మహిమాన్వితుడైన శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో కన్నులపండుగగా శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపనా మహోత్సవం జరిగింది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు తరలి వచ్చారు. ముఖ్యంగా క్రికెటర్లు కూడా వచ్చి ఆ శ్రీరాముని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా వారేమన్నారో చూద్దాం…
ప్రతీ ఒక్కరూ అయోధ్యను సందర్శించాలి: మిథాలీ రాజ్
అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని ప్రతీ ఒక్కరూ సందర్శించుకోవాలని, అంత గొప్పగా విగ్రహం ఉందని మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తెలిపింది. శ్రీరామ మందిర నిర్మాణం అత్యద్భుతంగా ఉందని తెలిపింది. ఇది భారతీయులందరికీ గొప్ప రోజుగా పేర్కొంది. శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. చెప్పలేని ఆనందంతో ఉన్నానని తెలిపింది.
రామ్ లల్లా ఆశీర్వాదం కోసం వచ్చా: అనిల్ కుంబ్లే
ఇది ఒక అద్భుతమైన, చారిత్రాత్మకమైన, దైవిక దర్శనమని ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నాడు. అయోధ్యలో బాల రాముని విగ్రహప్రతిష్ఠాపనకు సతీసమేతంగా విచ్చేసిన కుంబ్లే మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని అన్నాడు. రామ్ లల్లా ఆశీర్వాదం కోసం వచ్చానని తెలిపాడు.
ఇక నుంచి అయోధ్యకు వస్తూనే ఉంటానని తెలిపాడు. ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక వేడుకను కనులారా చూడటం, అలాంటి సమయంలో ఇక్కడ ఉండటం ఒక మధురానుభూతిని ఇచ్చిందని అన్నాడు. శ్రీరాముడి ఆశీర్వాదాలు తొలిరోజున అందుకోవడం సంతోషంగా, ఒకింత గర్వంగా కూడా ఉందని అన్నాడు.
భారతీయులందరికీ గొప్ప సుదినం: నైనా సెహ్వాల్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నైనా సెహ్వాల్ మాట్లాడుతూ ఇది భారతీయులందరికీ సుదినం అని తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఇది మాటల్లో చెప్పలేనని అన్నాది. ఇంతటి అనుభూతిని ప్రతీ ఒక్కరూ అనుభవించాలని, అందరూ శ్రీరాముని జన్మభూమిని తరించి ధన్యులు కావాలని తెలిపింది.
నా జీవితంలో ఇవి గొప్ప క్షణాలు: వెంకటేశ్ ప్రసాద్
భారతదేశంలో జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన ప్రారంభోత్సవంలో పాల్గొనడం, ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని ప్రముఖ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. నా జీవితంలో ఇవి గొప్ప క్షణాలు, జీవితాంతం గుర్తుండిపోతాయని తన్మయత్వంతో అన్నాడు. అయోధ్య రామ మందిర నిర్మాణం మహాద్భుతమని కొనియాడాడు.
ఆనందంతో నోట మాట రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
జై శ్రీరామ్… ఈ మహదవకాశాన్ని ప్రసాదించిన ఆ శ్రీరామచంద్రుడికి జన్మజన్మలకి రుణపడి ఉంటానని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆ రామ విగ్రహాన్ని చూసి ఆనంద పరవశుడినయ్యానని అన్నాడు. ఇలాంటి అపూర్వ రోజును తీసుకువచ్చిన వారికి, దీనికోసం ఎన్నో త్యాగాలు చేసిన వారందరికీ ధన్యవాదాలని తెలిపాడు.