SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మహేశ్ నటించబోయే తదుపరి మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ తన నెక్స్ట్ సినిమాను చేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయనే చెప్పాలి.
ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహేశ్ – రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న కొత్త మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల సెలక్షన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ‘SSMB 29’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం బడా స్టార్లను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికీ ఈ బడా హీరోలను మూవీ యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.