100 Year Restaurant : ఆధునిక కట్టడాల మధ్య ఒదిగిపోయిన ఓ రెండంతస్తుల భవనం. చూసేందుకు సాదాసీదాగా అనిపించినా.. దాని వెనుక వందేళ్ల చరిత్ర ఉందని ఎవరూ ఊహించలేరు. బెంగళూరు లాల్బాగ్ రోడ్డులోని ఆ భవనంలోనే ఉంది మావళ్లి టిఫిన్ రూమ్స్(MTR). కమ్మటి రుచులను అందించడంలో వందేళ్ల ప్రస్థానం ఆ రెస్టారెంట్ది. వేడి వేడి రవ్వ ఇడ్లీలు, మళ్లీ మళ్లీ తినాలనిపించే మసాలా దోశె, ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు ముక్కుపుటాలను అదరగొడుతుంటాయి.
సరిగ్గా వందేళ్ల క్రితం ఉడుపికి చెందిన సోదరులు యజ్ఞనారాయణ, గానప్పయ్య ఆరంభించిన ఈ రెస్టారెంట్.. నేటికీ దక్షిణ భారత దేశ రుచులను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం హేమమాలిని, విక్రమ్, అరవింద్లతో కూడిన మూడో తరం రెస్టారెంట్ బాధ్యతలను చూస్తోంది. తొలినాళ్లలో కాఫీ, ఏవో కొన్ని స్నాక్స్ అందజేసేవాళ్లు. రెస్టారెంట్కు ఉన్నది కొద్ది స్థలం కావడం వల్ల కార్లను రెస్టారెంట్ ముందు నిలిపేవారు. కార్లలో కూర్చున్న కస్టమర్ల వద్దకే కాఫీ, స్నాక్స్ను చేరవేసేవాళ్లు. అలా ప్రపంచంలోనే తొలి డ్రైవ్-త్రూ రెస్టారెంట్గానూ ఇది పేరు గడించిందని యాజమాన్యం మూడో తరం ప్రతినిధి, మేనేజింగ్ పార్ట్నర్ హేమమాలిని మాయ వివరించారు.
1951లో యజ్ఞనారాయణ యూరప్ అంతటా పర్యటించి.. అక్కడి రెస్టారెంట్లు, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. 1960లో కొత్త స్థలం(ప్రస్తుత లాల్బాగ్ రోడ్డు)లో ఏర్పాటు చేసిన ఎంటీఆర్ రెస్టారెంట్లో వాటిని అమలు చేశారు. రవ్వ ఇడ్లీ ఇక్కడి ప్రత్యేకం. దీని వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. రెండో ప్రపంచ యుద్ద సమయంలో రైస్ సప్లై చాలా తక్కువగా ఉండేది. దాంతో రైస్కు బదులు సెమోలినా రవ్వ వినియోగించారు. చివరకు అదే రవ్వ ఇడ్లీ.. ప్రసిద్ధ అల్పాహారంగా మారింది.
1975లో ఫుడ్ కంట్రోల్ యాక్ట్ రాకతో హోటల్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తక్కువ ధరలకే ఆహారాన్ని అందించాలనే నిబంధనలతో ఎంటీఆర్ రెస్టారెంట్ కూడా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కొన్ని వారాలకే రెస్టారెంట్ మూతపడింది. దీంతో కొత్త పంథాను అనుసరించాలని కుటుంబం నిర్ణయించుకుంది. అప్పటి నుంచి మసాలాలు, ఇనస్టంట్ మిక్స్లను విక్రయించడం మొదలుపెట్టారు.
రెస్టారెంట్ను తిరిగి 1981లో తెరిచారు. 2007లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ బిజినెస్ని నార్వేకు చెందిన ఓర్క్లా సంస్థ రూ.350 కోట్లకు టేకోవర్ చేసింది. విదేశాల్లో ఎంటీఆర్ తన తొలి రెస్టారెంట్ని 2013లో సింగపూర్లో ప్రారంభించింది. ప్రస్తుతం లండన్, సింగపూర్, మలేసియా, దుబాయ్కు ఇవి విస్తరించాయి. ఇటీవలే అమెరికా సియాటెల్లో ఎంటీఆర్ రెస్టారెంట్ ఆరంభమైంది.