Cricketers In Ayodhya Mandir : భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రామ మందిర ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ఏడువేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వారిలో చాలామంది అయోధ్య పురవీధులో సందడి చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ సతీసమేతంగా విచ్చేశాడు. విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా, మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అయోధ్యలోని శ్రీరామమందిరం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
అనిల్ కుంబ్లే దంపతులు దేవాలయ ప్రాంగణంలో తిరుగుతూ కనిపించారు. అంతేకాదు భార్యతో కలిసిన ఫొటోలను ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ రామమందిర ప్రారంభోత్సవం గొప్ప వేడుకని, ఇందులో భాగమవడం తన అదృష్టంగా పేర్కొన్నాడు.
ఇంకా మహేంద్ర సింగ్ ధోనీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ , హర్మన్ప్రీత్ కౌర్ క్రికెటర్లు సహా పలువురు ఇతర ఆటగాళ్లు సైతం ఆహ్వానాలు అందుకున్నారు.
ఆహ్వానం దక్కిన ప్లేయర్లతో ‘అయోధ్య జట్టు’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అంతేకాదు వీరితో ఒక తుది జట్టును ప్రకటించారు. ఇందులో ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వన్డౌన్లో విరాట్ కోహ్లీకి, ఇక నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో గంగూలీ, రోహిత్ శర్మ, కపిల్ దేవ్ లకు అవకాశం కల్పించారు.
అయోధ్య జట్టుకి కూడా మహేంద్రసింగ్ ధోనీయే కెప్టెన్ గా ఉంటాడు. వికెట్ కీపర్గా రాహుల్ ద్రవిడ్ ను సెలక్ట్ చేశారు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి ఎంపికయ్యారు.
సెహ్వాగ్, గంభీర్, హర్భజన్ సింగ్ లకు తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై నెట్టింట ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 2011 వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడని చెబుతున్నారు. అలాంటివాడిని వదిలేయకూడదని అంటున్నారు. అలాగే హర్భజన్ సింగ్ కాంగ్రెస్ పార్టీతో గొడవ పెట్టుకుని మరీ అయోధ్య వచ్చాడని గుర్తు చేస్తున్నారు.