Bahubali Lock : అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఉత్సవాలు కన్నులవిందుగా జరుగుతున్నాయి. సాంస్కృతిక నృత్యాలు, మంగళ వాయిద్యాలతో పాటు.. జై శ్రీరామ్ నామస్మరణతో.. అయోధ్యతో పాటు యావత్ దేశం మారుమ్రోగుతోంది. ఎటుచూసిన జై శ్రీరామ్ నామస్మరణే వినిపిస్తోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం చేపట్టింది మొదలు.. ఇప్పటి వరకూ.. అనేకానేక కానుకలు రాములవారి చెంతకు చేరుకున్నాయి. రామభక్తులు.. కానుకల రూపంలో తమ ఉడతా భక్తిని చాటుకుంటున్నారు.
ఈ క్రమంలో జనవరి 20న కానుకల క్రతువును నిర్వహించగా.. అయోధ్య రామయ్యకు దేశనలుమూలల నుంచి కానుకలు వెల్లువెత్తాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాకు చెందిన భక్తులు బాహుబలి తాళంను పంపించారు. 400 కిలోలు ఉన్న బాహుబలి తాళాన్ని తయారు చేసేందుకు సుమారు 6 నెలల సమయం పట్టిందని తెలిపారు. అందుకు రూ.2 లక్షల వరకూ ఖర్చైనట్లు సమాచారం. అయోధ్యకు భారీట్రక్కులో దానిని తరలించగా.. కిందికి దించేందుకు ఒక క్రేన్ ను ఉపయోగించారు.
అయోధ్యకు చేరుకున్న ఈ బాహుబలి తాళం తయారీ వెనుక.. ఒకరి కోరిక ఉంది. రెండేళ్లక్రితం సత్యప్రకాశ్ శర్మ, రుక్మిణి శర్మ దంపతులు ఈ బాహుబలి తాళం తయారీని ప్రారంభించారు. వీరి స్వస్థలం అలీగఢ్ లోని నోరంగాబాద్. తాళం తయారీ ఇటీవలే పూర్తయింది. కానీ అది అయోధ్యకు చేరకుండానే ప్రకాశ్ శర్మ కాలం చేశారు.అయోధ్య ఆలయానికి ఆ తాళాన్ని అందజేయాలన్న తన భర్త కోరికను రుక్మిణి తీర్చారు.
అలాగే.. హైదరాబాద్ కు చెందిన భక్తులు.. రామ్ లల్లాకు 1265 కిలోల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి తమ భక్తిని చాటుకున్నారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున అంటే నేడు ఈ ప్రసాదాన్ని భక్తులకు పంచనున్నారు. 25 మంది సిబ్బంది లడ్డూప్రసాదం తయారీలో పాలుపంచుకున్నారు. ఈ ప్రసాదం నెలరోజుల వరకూ నిల్వ ఉంటుందని క్యాటరింగ్ యజమాని నాగభూషణ్ రెడ్డి చెబుతున్నారు. తన కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడని భావిస్తున్నట్లు అతను పేర్కొన్నారు. ఇకపై తాను బ్రతికి ఉన్నంతకాలం రోజుకొక కిలో లడ్డూను తయారు చేస్తానని తెలిపారు. బాహుబలి లడ్డూ, భారీ తాళంతో పాటు.. అష్టధాతువులతో తయారు చేసిన భారీ గంటను కూడా అయోధ్యకు తరలించారు. బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, టిన్, ఇనుము, పాదరసంతో తయారు చేసిన గంటను అయోధ్యకు రామమందిరానికి సమర్పించారు.