Ayodhya : కోట్లాది మంది భక్తుల కల నెరవేరింది. అయోధ్య మందిరంలో రాముడు కొలువుదీరాడు. 84 సెకన్ల దివ్యమైన ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఆ మహోత్సవం నిర్వహించారు.అయోధ్యలో రామయ్య కొలువుదీరిన ఈ అపురూప క్షణాలతో దేశవ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ సమయంలోనే మోదీ.. విగ్రహ కళ్లకు ఆచ్ఛాదన వస్త్రాన్ని తొలగించారు. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దారు. రామ్లల్లాకు చిన్న అద్దాన్ని చూపించారు. ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసింది.
ఎడమ చేతిలో విల్లు.. కుడి చేతిలో బాణం.. అయోధ్యలో బాలరాముడి దర్శనం..
స్వర్ణాభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడి దర్శనమిచ్చాడు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకిస్తోంది. టీవీల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి భక్తకోటి పరవశించారు.
అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు అంగరంగ వైభవంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు సాగింది. బాలరాముడికి మోదీ తొలి హారతి ఇచ్చారు. సాష్టాంగ నమస్కారం చేశారు.
ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆయోధ్య రామమందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు 2 గంటలపాటు ఏకధాటిగా మంగళ వాయిద్యాలు మోగించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు, సినీరాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.