Ayodhya Old Statue : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా సాగుతోంది. మధ్యాహ్నం తర్వాత ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఈ నేపథ్యంలో పాత విగ్రహాన్ని ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లూ తాత్కాలిక మందిరంలో ఉన్న పాత రామ్లల్లా మూర్తి.. నేడు గర్భగుడిలో కొత్తగా ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్దేవ్ గిరి వెల్లడించారు. పాత విగ్రహం అయిదారు అంగుళాల ఎత్తు ఉంది. 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి.. అది స్పష్టంగా కనిపించదని.. అందుకే కొత్త మూర్తి అవసరమైందని ఆయన తెలిపారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు 11 వందల కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. మందిర నిర్మాణం 2024లోనే పూర్తి చేస్తామని.. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో మూడు వందల కోట్లు అవసరం అవుతాయని చెబుతున్నారు. ముగ్గురు శిల్పులు చెక్కిన విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమను ఎంపిక చేయడానికి తర్జనభర్జన పడాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఎంతో చక్కగా ఉన్న మిగతా రెండింటిని కూడా ఆలయంలోనే ఉంచుతామని వెల్లడించారు. వాటిలో ఒకదానిని రాముడి వస్త్రాలు, ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తామన్నారు.
దేశమంతా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఆవరించిందని.. ముఖ్యంగా యువత కూడా ఇటువైపు చూస్తుండటం మంచి పరిణామమని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రణాళిక ఏమిటనే విషయంపై రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ స్పందించారు. జనవరి 23 నుంచే మళ్లీ నిర్మాణపనులను మొదలుపెడతామని ఆయన తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మరో ఏడు ఉపాలయాలు నిర్మించాల్సి ఉందని చెప్పారు.