Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఈ శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు అయోధ్యకు చేరుకోగా మరికొందరు ఇవాళ అక్కడికి చేరుకోనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు సూపర్స్టార్ రజినీకాంత్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కల.. 500 ఏళ్ల తర్వాత నెరవేరుతోందని అన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. పునఃప్రతిష్ఠాపనకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.