Bihar : తల్లిదండ్రులు కొట్టారని ఇల్లు వదిలి ముంబయికి పారిపోయాడు. రైల్వే స్టేషన్ లో నిల్చున్న అతన్ని చూసి ప్రయాణికులు బిచ్చగాడు అనుకుని డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు గంటల్లో రూ.3400 చేతికి వచ్చాయి. అంతే ఈ వృత్తి బాగుందని అప్పటి నుంచి బిచ్చం ఎత్తుకోవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతను ఓ శ్రీమంతుడిగా మారాడు.
బిహార్లోని పాట్నాకు చెందిన పప్పు అనే బిచ్చగాడు యాచించిన సొమ్ముతోనే శ్రీమంతుడు అయ్యాడు. నగరంలో అనేక చోట్ల భూమిని కొన్నాడు. పట్నాలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. సొంతింట్లోనే ఉంటూ తన వృత్తిని కొనసాగిస్తున్నాడు.
‘‘చిన్నప్పుడు బాగా చదవడం లేదని కుటుంబసభ్యులు నన్ను కొట్టారు. దాంతో ముంబయికి పారిపోయాను. రైల్వే స్టేషన్లో నిల్చున్న నన్ను చూసి బిచ్చగాడిగా భావించి ప్రజలు డబ్బులు ఇచ్చారు. రెండు గంటల్లోనే చేతికి రూ.3,400 వచ్చాయి. మరుసటి రోజు వెళ్లి అదే స్థలంలో కూర్చున్నా. మళ్లీ డబ్బులు వేశారు.అప్పటి నుంచి అదే అలవాటుగా మారి పాట్నాకు తిరిగి వచ్చి భిక్షాటన చేయడం ప్రారంభించాను’’ అని పప్పు అన్నాడు. ‘‘నా ఇద్దరు పిల్లలను ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను. యాచించిన సొమ్ముతోనే నా పిల్లలను అధికారులుగా తీర్చిదిద్దుతాను’’ అని పప్పు వివరించాడు.