అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటల నుంచి 12.55 గంటల మధ్యలో ప్రధాని నరేంద్రమోదీ.. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, జై శ్రీరామ్ అనే భక్తుల రామనామస్మరణల మధ్య బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మహత్ కార్యంకోసం యావత్ దేశం.. కోట్లాది కళ్లతో ఎదురుచూస్తోంది. దేశంలోని నగరాలన్నీ రామనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. విదేశాల్లో ఉన్న భక్తులు సైతం రామనామస్మరణ చేస్తుండగా.. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా.. అయోధ్యలో జరగనున్న ఈ వేడుకకు 8 వేల మంది వరకూ భక్తులు వస్తారని అంచనా. ఇప్పటికే ఆహ్వానం అందుకున్న ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా.. దేశంలోని చిన్నా, పెద్ద దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ క్రమంలో భారతీయ పారిశ్రామిక దిగ్గజం.. ముఖేష్ అంబానీ ముంబైలోని తన నివాస భవాన్ని రామనామంతో నింపేశారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా.. యాంటిలియా భవనాన్ని అందంగా ముస్తాబు చేయించారు.
యాంటిలియా భవనమంతా దీపాలతో, జై శ్రీరామ్ అనే నామాలతో సెట్ చేయించారు. అద్భుతమైన లైటింగ్ తో కనిపించే ఈ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రస్తుతం ఈ యాంటాలియా భవనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తం 27 అంతస్తులు రామ నామాలతో కనిపించడాన్ని చూసి.. నెటిజన్లు పులకించిపోతున్నారు.