Krishnamachari Srikkanth : ఒకప్పటి ఇండియా ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అంటే తెలియని వారుండరు. ఒక 43 సంవత్సరాల క్రితం అంటే 1981లో వన్డే జట్టులోకి వచ్చిన శ్రీకాంత్ అనతి కాలంలోనే ధనాధన్ ప్లేయర్ గా పేరుపొందాడు. ఇప్పుడు అందరూ ఆడే టీ 20 ఆటను తను అప్పుడే ఆడి అందరికీ చూపించాడు.
ఎన్నిసార్లు తను ఫస్ట్ ఓవర్ లో అవుట్ అయినా, ఎన్నిసార్లు డక్ అవుట్ అయినా, తన బ్యాటింగ్ శైలిని ఎప్పుడూ మార్చుకోలేదు. ఆ దూకుడుని తగ్గించలేదు. తను రిటైర్మెంట్ ప్రకటించిన ఆఖరి మ్యాచ్ లో కూడా అదే దూకుడుగా ఆడాడు.
ఒకవైపు సునీల్ గవాస్కర్ డిఫెన్స్ ఆడుతుంటే, ఇటువైపు శ్రీకాంత్ దూకుడుగా ఆడి రన్ రేట్ తగ్గకుండా చూసుకునేవాడు. ఒకరు కొట్టేవారు, ఒకరు వికెట్లు పడకుండా చూసుకునేవారు. అప్పట్లో అదొక గేమ్ ప్లాన్. ఆరోజుల్లో శ్రీకాంత్ కి ఉన్న పేరు సామాన్యమైనది కాదు. అలాంటి శ్రీకాంత్ సడన్ గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. అవుతూనే కొహ్లీ గురించి మాట్లాడాడు.
సహజసిద్ధమైన ఆటనే ఆడమని సలహా ఇచ్చాడు. నీ బ్యాటింగ్ శైలికి మొదటి నుంచి దూకుడుగా ఆడేందుకు సెట్ కాదని అన్నాడు. కొంతసేపు క్రీజులో నిలదొక్కుకున్నాక, అప్పుడు ఎటాకింగ్ ఆడవచ్చునని అన్నాడు. అంతేగానీ టీ 20 మ్యాచ్ లు కదాని, మొదటి బాల్ నుంచి కొడితే, అది నీకు, జట్టుకు కూడా శ్రేయస్కరం కాదని అన్నాడు.
ఇదంతా ఎందుకంటే ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడో టీ 20లో విరాట్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. ఒకవైపు నుంచి రోహిత్ శర్మ దంచి కొడుతున్నాడు. దీంతో తను కూడా రన్ రేట్ పెంచాలి, స్కోర్ పెంచాలనే ఉద్దేశంతో ఫస్ట్ బాల్ నే పైకి లేపాడు. అది సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో సులువైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ విషయంపైనే శ్రీకాంత్ సలహా ఇచ్చాడు.
‘ప్రతీ ఆటగాడికి సొంత గేమ్ అంటూ ఒకటి ఉంటుంది. దానినే ఫాలో కావాలి. దూకుడుగా ఆడే యశస్వి జైస్వాల్ ను నెమ్మదిగా ఆడమంటే కుదరదు. అలాగే టైమ్ తీసుకుని ఆడేవాళ్లని, మొదటి బాల్ నుంచి కొట్టమంటే సాధ్యం కాదని అన్నాడు. రోహిత్ శర్మది వేరే అని అన్నాడు. తన బ్యాటింగ్ శైలే దూకుడుగా ఉంటుంది. తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయగలడని తెలిపాడు.
విరాట్ కోహ్లీకి మొదటి బాల్ నుంచి దూకుడుగా ఆడలేడు. ఒక ఓవర్ అయినా టైమ్ తీసుకుంటాడు. అందుకే కోహ్లీ తన సహజ శైలినే కొనసాగించాలని తెలిపాడు. ఇన్నింగ్స్ చివర్లో ఆటోమేటిక్ గా దూకుడుగా ఆడే సత్తా కొహ్లీలో ఉంది.
ఎందుకంటే అప్పటికే క్రీజ్ లో ఉండటం వల్ల అలవోకగా సిక్సర్లు కొడతాడని తెలిపాడు. మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అతను భారత్ గెలిపించిన తీరును అందరం చూశాం కదా అని అన్నాడు.
తొలి బంతి నుంచే బ్యాట్ని అడ్డంగా ఊపితే .. ఏదో ఒకటి రెండు కనెక్ట్ అవుతాయి కానీ.. అన్నీ కావు. ఇదేం గల్లీ క్రికెట్ కాదు. అంతర్జాతీయ క్రికెట్. కాబట్టి విరాట్ కోహ్లీ తన సహజసిద్ధమైన ఆటనే ఆడాలి.. అని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.