Murder : 15 ఏళ్ల బాలుడు సొంత బామ్మను డబ్బుల కోసం హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో షహదారా ప్రాంతంలో జరిగింది. జల్సాలకు అలవాటు పడిన ఆ బాలుడు స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను హత్య చేశాడు. ఆమె దగ్గరున్న డబ్బులు దొంగలించి పారిపోయాడు. జీటీబీ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం నివాసం ఉంటుంది.
వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు అతని స్నేహితుడు ఇంటికి వచ్చారు. దుప్పటితో అదిమి ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను దొంగలించి పారిపోయారు. కొంత సేపటికి ఇంటికి చేరుకున్న వృద్ధుడు భార్య నిద్రలోనే చనిపోయిందని భావించాడు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతిరాలి నుదుటిపై గాయం ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనుమానం వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. దీంతో బీరువా లాకర్లో డబ్బు మాయమైనట్లు గుర్తించారు. వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనవడే బామ్మను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.