Madakasira Singanamala | అనంతపురం జిల్లాలో ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థులుగా దిగాలని భావించిన ఇద్దరు పోలీస్ అధికారులకు జగన్ షాక్ ఇచ్చారు. ఓ అధికారి పేరైతే అధికార పార్టీ విడుదల చేసిన మూడో జాబితాలో వచ్చింది. అయినప్పటికీ నాలుగో జాబితాలో పేరు మారిపోయింది.
Madakasira Singanamala | అనంతపురం జిల్లాలో ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థులుగా దిగాలని భావించిన ఇద్దరు పోలీస్ అధికారులకు జగన్ షాక్ ఇచ్చారు. ఓ అధికారి పేరైతే అధికార పార్టీ విడుదల చేసిన మూడో జాబితాలో వచ్చింది. అయినప్పటికీ నాలుగో జాబితాలో పేరు మారిపోయింది. మరో అధికారికి ముగ్గురు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా వైసీపీ అధ్యక్షుడు మాత్రం కనికరించలేదు. అసలు ఏం జరిగింది?.. ఉద్యోగాలు వదులుకోవడానికి రెడీ అయిన ఆ అధికారుల పేర్లను ఎవరు ప్రతిపాదించారు? .. ఎందుకు రిజెక్ట్ అయ్యాయి?
అనంతపురం జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకు అధికార పార్టీ వైసీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇద్దరు పోలీస్ అధికారులు ఆ రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటికి సిద్ధపడ్డారు. ముఖ్యంగా మడకశిర నియోజకవర్గానికి సంబంధించి.. కరోనా సమయంలో మడకశిర సీఐగా పనిచేసిన శుభకుమార్.. ప్రస్తుతం సిఐడిలో పనిచేస్తున్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ అధికారి కూడా పనిచేశారు.
శుభకుమార్ మడకసిర వైసీపీ టికెట్ కోసం పూర్తిస్థాయిలో ప్రయత్నించారు. ఒక పోలీసు ఉన్నతాధికారి సాయంతో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి.. వచ్చే ఎన్నికల్లో మడకశిర నుంచి తనకు అవకాశం ఇవ్వమని .. అందుకు తగ్గ ఆర్థిక వనరులు ఉన్నాయని కూడా ప్రపోజల్ పెట్టారంట. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఓకే అంటూ ఆయన పేరును మూడో లిస్టులో ప్రకటించారు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆర్థిక వనరుల విషయంలో సిఐ సిద్ధంగా ఉన్నారా? ఆయన స్థాయి ఏంటి? .. అని పార్టీ వర్గాలు ఎంక్వయిరీ చేశాయంట.
అదే సమయంలో మడకశిరలోని స్థానిక వైసీపీ నేతలు గతంలో సీఐగా ఉన్నప్పుడు ఆయన తమను ఇబ్బందులు పెట్టారని ఫిర్యాదులు చేశారంట. మొత్తం మీద ఆర్థిక వనరులు విషయంలో సీఐ పూర్తిస్థాయిలో అధిష్టానాన్ని సంతృప్తి పరచలేక పోవడంతో .. ఆయన స్థానంలో స్థానిక నేత వీర లక్కప్ప పేరును నాలుగో లిస్ట్లో ప్రకటించారు. మొత్తంమీద ఆ విధంగా సిఐ ఆశలు అడియాశాలయ్యాయి.
సింగనమల నియోజకవర్గం వైసీపీ టికెట్ ఆశిస్తున్న మరో పోలీస్ అధికారి .. చిత్తూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన తన స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి యువగళము పాదయాత్రలో యువనేత లోకేష్ను బాగా చికాకు పెట్టారు. మైక్ లాక్కోవడం క్యాడర్ ను దూరంగా తరమడం…. ఓ నియోజకవర్గంలో అయితే పూర్తిస్థాయిలో యువగళానికి టీడీపీ కార్యకర్తలు తరలిరాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం కూడా చేసి అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఇదే సమయంలో సింగనమల నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి వ్యతిరేకంగా ఆ నియోజకవర్గంలో పట్టు ఉన్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, సీనియర్ గా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిలు చక్రం తిప్పారంట.
జొన్నలగడ్డ పద్మావతి మాల సామాజిక వర్గానికి చెందిన నేత… అయితే సింగనమల నియోజకవర్గంలో మాదిగలు ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి ఆమె గెలిచే అవకాశం లేదని.. దానికి తోడు ఆమె భర్త సాంకేతిక విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబం సభ్యుల వైఖరితో సెగ్మెంట్లో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని.. అందుకే ఈసారి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వవద్దని సదరు రెడ్డి ఎమ్మెల్యేలు సీఎంఓకు సమాచారం పంపారంట.
ఆ క్రమంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తో పాటు అనంతరామ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సైతం చిత్తూరు డీఎస్పీకి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారంట. పోలీస్ అధికారికి సపోర్ట్ చేసినప్పటికీ సీఎంఓలోని సీనియర్ అధికారులు మాత్రం ఆలూరు సాంబశివారెడ్డి అభ్యర్థి వైపే మొగ్గుచూపడంతో .. ఆలూరు సాంబశివారెడ్డి నియోజవర్గంలో తన పట్టు కోల్పోకుండా తన దగ్గర పనిచేసే వీరాంజనేయులను తెరమీదకి తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇప్పించుకోగలిగారు.
దానికి తోడు రాయలసీమ వైసీపీ కోఆర్డినేటర్ అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరి పోలీస్ అధికారుల విషయంలో తాను సంతృప్తికరంగా లేనని జగన్మోహన్ రెడ్డికి చెప్పడం కూడా వారికి మైనస్ అయిందంటున్నారు. మొత్తం మీద రాయలసీమ వ్యాప్తంగా ఈ పోలీస్ అధికారుల టికెట్లు అంశం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.