Vidadala Rajani | ఏపీలో జరగనున్న ఎన్నికల్లో మంత్రి రజని పరిస్ధితి ఏంటో ఆమెకే అర్ధంకావటం లేదట. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవగానే కేబినెట్ బెర్త్ దక్కించుకున్న ఆ బీసీ నేత.. తర్వాత ఎలక్షన్కే సెగ్మెంట్ మారాల్సి వచ్చింది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న రజని దాన్ని వదులుకుని పొలిటిక్ ఎంట్రీ ఇచ్చారు.
Vidadala Rajani | ఏపీలో జరగనున్న ఎన్నికల్లో మంత్రి రజని పరిస్ధితి ఏంటో ఆమెకే అర్ధంకావటం లేదట. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవగానే కేబినెట్ బెర్త్ దక్కించుకున్న ఆ బీసీ నేత.. తర్వాత ఎలక్షన్కే సెగ్మెంట్ మారాల్సి వచ్చింది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న రజని దాన్ని వదులుకుని పొలిటిక్ ఎంట్రీ ఇచ్చారు. యూఎస్ నుంచి రావటం రావటమే తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే టీడీపీలో టికెట్ గ్యారెంటీ లేక వైసీపీలో చేరి .. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడామె గుంటూరు వెస్ట్కు మారాల్సి వచ్చింది. దాంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.
మంత్రి విడదల రజనీగుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 2019లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. బీసీ సామాజికవర్గానికి చెందిన రజనీ స్వతహాగానే చాలా స్పీడుగా ఉంటారు. ఆమె టీడీపీలో టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో .. జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరేటప్పుడే టికెట్ పై హామీ తీసుకున్నారు. అప్పటి నుండి చిలకలూరిపేటలో తనదైన శైలిలో చక్రం తిప్పుతూ వచ్చి.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆ ఎన్నికల్లో 8300 ఓట్లతో ఓడించారు . అమెరికా నుండి రావటమే టికెట్ దక్కించుకుని .. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమె .. విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు.
అదృష్టం అలా కలిసి వచ్చిన రజినీ ఎప్పుడైతే మంత్రి అయ్యారో.. అప్పటి నుండి నియోజకవర్గంలో సమస్యలు మొదలయ్యాయి. రజనీకి ముందు చిలకలూరి పేట వైసీపీ ఇన్చార్జ్, ప్రస్తుత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ వర్గంతో విభేదాలు ముదిరిపోయాయి. అదే టైంలో స్థానిక నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుతోనూ గ్యాప్ పెరిగింది. నియోజకవర్గంలో మర్రి, లావు ఎఫెక్ట్లో చిలకటూరిపేట సెగ్మెంట్లో స్థానిక నేతలు అత్యధికులు ఆమెను వ్యతిరేకిస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లో పేటలో రజని గెలుపు కష్టమని ప్రచారం మొదలైపోయింది . దానికి తోడు జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో రజనీపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే ఆమెకు గుంటూరు వెస్ట్ ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టి.. ఆ సెగ్మెంట్కు షిఫ్ట్ చేశారు .
గుంటూరు వెస్ట్లో బీసీ ఓటర్లు గణనీయంగా ఉంటారు. అయితే ఆ నియోజకవర్గానికి కొత్త ముఖమైన రజనీ అక్కడ చక్రం తిప్పగలరా? పార్టీనేతలు, క్యాడర్ని కలుపుకుని పోగలరా? అన్న అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. మంత్రికి గుంటూరు వెస్ట్లో ఎంతమంది తనకు సహకరిస్తారో అర్థం కావడం లేదంటున్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ నుండి పోటీ చేసిన యేసురత్నంకి .. అక్కడ పట్టున్న లేళ్ల అప్పిరెడ్డి వర్గం ఏ మాత్రం సహకరించలేదంట. తన ఓటమికి కారణం అప్పిరెడ్డే అని యేసురత్నం ఇప్పటికీ మొత్తుకుంటుంటారు.
ఇక గుంటూరు వెస్ట్లో యేసురత్నంపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం వైసీపీ మద్దతుదారుడయ్యారు. వైసీపీలో తిరిగి టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే వర్గం అసంతృప్తితో ఉంది. అదలా ఉంటే గుంటూరు మేయర్ మనోహర్నాయుడు కూడా పశ్చిమ సీటు ఆశించారన్న ప్రచారం ఉంది. ఈ ఇద్దరు ఆ సెగ్మెంట్లో అంతోఇంతో పట్టున్న నేతలే.. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో మద్దాలి గిరి, మనోహర్నాయుడు వర్గాలు.. కొత్తగా వచ్చిన రజినీకి ఎంత వరకు సహకరిస్తారనేది అంతుపట్టకుండా తయారైంది.
ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మద్దాలి గిరికి గట్టి పోటీ ఇచ్చిన యేసురత్నం ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎంత వరకు పనిచేస్తారో అన్న దానిపై క్లారిటీ లేదంటున్నారు. అదీకాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పటికీ.. వెస్ట్ నుంచి మద్దాలిగిరిని గెలిపించుకున్న టీడీపీ శ్రేణులు .. ఆయన పార్టీ ఫిరాయించడంతో రగిలిపోతున్నాయి .. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టాలన్న పట్టుదలతో గ్రౌండ్వర్క్ చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రజిని గెలిస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చేమో కాని … అదే ఓడిపోతే మాత్రం కష్టాలు తప్పేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది… ఓడిపోతే ఇటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కంటిన్యూ అవ్వలేక… మళ్ళీ చిలకలూరిపేట నియోజకవర్గానికి వెళ్ళలేక రజనీ ఇబ్బంది పడాల్సిందే అంటున్నారు. చూడాలి మరి ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో?