Mrinalini Sarabhai : నాట్యం ద్వారా సామాజిక సమస్యలను ప్రపంచం ముందుంచిన 20వ శతాబ్దపు గొప్ప నృత్యకారుల్లో మృణాళినీ సారాభాయ్ అగ్రగణ్యులు. చెన్నైలో స్థిరపడిన కేరళ కుటుంబంలో మృణాళిని జన్మించారు. తండ్రి సుబ్బరామ స్వామినాథన్. మద్రాస్ హైకోర్టులో పేరుమోసిన బారిస్టర్. తల్లి అమ్ము స్వాతంత్య్ర సమరయోధురాలు. సోదరి లక్ష్మీ (సెహగల్) సుభాష్చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఫౌజ్ లోని “రాణి ఆఫ్ ఝాన్సి రెజిమెంట్” విభాగానికి కమాండర్ గా పని చేసారు. సారాభాయి చిన్నతనంలోనే గురువు మీనాక్షి సుందరం పిళ్లై వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందారు.
ఆ తర్వాత ఆమె కథాకళి నేర్చుకున్నారు. ప్రాథమిక విద్యను చెన్నైలో పూర్తిచేసిన మృణాళిని.. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పై చదువులను అభ్యసించారు. అనంతరం శాంతినికేతన్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు స్వదేశం వచ్చారు. అక్కడ ఇతర కళల్లో సైతం ఆమె శిక్షణ పొందారు. అమెరికాలోని అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్స్లోనూ.. జావా(ఇండోనేసియా)లోనూ ఆమె నటనలో శిక్షణ తీసుకున్నారు.
సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె మతం ప్రాతిపదికగా సాగే నృత్య ప్రదర్శనల స్థానంలో ఆధునిక కాలానికి చెందిన కథలకు పెద్దపీట వేశారు. కృష్ణగోపాల్.. మహాభారత్.. మొదలైన ఆమె నృత్యరూపకాలు వర్తమాన సమాజానికి అద్దంపట్టేవి. 1942లో భారత అంతరిక్ష పరిశోధనల పితామహుడు విక్రం సారాభాయిని మృణాళిని వివాహం చేసుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు కార్తికేయ సారాభాయి, ప్రముఖ నృత్యకారిణి మల్లికా సారాభాయి వీరి సంతానమే.
భర్త ప్రోత్సాహంతో ఆమె 1948లో ‘దర్పణ్’ పేరిట అహ్మదాబాద్లో నృత్యం, డ్రామా, సంగీత అకాడమీని ప్రారంభించారు. నృత్యం నేర్చుకునే దేశ విదేశాల్లోని ఔత్సాహికులకు గొప్ప కేంద్రంగా ఈ అకాడమీ నిలిచింది. మృణాళిని 300కు పైగా నృత్య రూపకాలను రాసి, స్వయంగా దర్శకత్వం వహించారు. శాస్త్రీయ నృత్యానికి దేశవిదేశాల్లో ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఆమె చేసిన సేవలు మరువలేనివి.
నృత్యం, పురాణాలపై ఆమె ఎన్నో రచనలు చేశారు. సరోజినీనాయుడు, మహాత్మాగాంధీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను సంకలన పరిచారు. నాట్యం మీది ప్రేమతో కవిత్వం రాసారు. మరొక ముఖ్యమైన రచన “ద వాయస్ ఆఫ్ హార్ట్” పేరుతో ఆత్మకథను రాసు కున్నారు. తమ సుదీర్ఘ, సుసంపన్నమైన జీవితాన్ని శాస్త్రీయ నృత్యాన్ని పునరుద్ధ రించటంలో, దానికి కొత్త సొబగులు అద్దటం ల్లో సార్థకం చేసుకున్నారు.
నాట్యకారిణిగా, కవయిత్రిగా, నృత్యదర్శకురాలిగా, సామాజిక కార్యకర్తగా ఆమె సేవలకు 1992లో పద్మ భూషణ్ అవార్డుతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. గుజరాత్ రాష్ట్ర హస్తకళలు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గానూ పనిచేశారు. 2016, జనవరి 22న, తన 97 సంవత్సరాల వయసులో ఆమె అహ్మదాబాద్లో కన్నుమూశారు.