West Indies : వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో ఎప్పుడూ ఏదొక తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఒకవైపు నుంచి వెస్టిండీస్ జట్టు అన్ని ఫార్మాట్లలో ఘోరంగా విఫలమవుతోంది. నాణ్యతలేని టీమ్ తో ఇంటా బయటా విమర్శలపాలవుతోంది. ఒకప్పుడు అరవీర భయంకరంగా ఉండే జట్టు, నేడు కళావిహీనంగా మారిపోయింది. ఒకరిద్దరూ జట్టులో ఉన్నా 11 మంది సరిగా లేక, వారి ప్రభ వెలవెలబోతోంది.
ఉదాహరణకి ఒకప్పుడు బ్రియాన్ లారా ఉండేవాడు. తనకి తోడు, ఒకరిద్దరు మాత్రమే స్టార్ ప్లేయర్లు ఉండేవారు. తర్వాత యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ ఉండేవాడు. ఎంత ఆడినా తనొక్కడే ఆడేవాడు. తనకి సపోర్ట్ ఇచ్చేవారే కరవయ్యేవారు. దాంతో తను బాగా ఆడినా మ్యాచ్ ఓడారు.
చివరికి అలాంటి ఒకరిద్దరు కూడా ప్రస్తుత జట్టులో లేరనే అంటున్నారు. అందుకే ఐసీసీ నిర్వహించే 2023 వన్డే వరల్డ్ కప్ లో వెస్టిండీస్ జట్టు క్వాలిఫై కాలేదు. అంతటి ఘోరమైన స్థితిలో పురుషుల జట్టు ఉంది.
అది అలా ఉంటే, మహిళల జట్టయినా పర్వాలేదనుకుంటే తాజాగా నలుగురు స్టార్ ప్లేయర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు. దీనిని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. మరో 8 నెలల్లో బంగ్లాదేశ్ వేదికగా టీ 20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో వీరి రిటైర్మెంట్ తో వెస్టిండీస్ జట్టులో కుదుపులు మొదలయ్యాయి. బోర్డులో విభేదాల వల్లే ఇలా జరిగిందని అంతా అనుకుంటున్నారు.
ఇప్పటికే వెస్టిండీస్ బోర్డులో ఆర్థిక పరిస్థితులు బాగుండక, ఆటగాళ్లకు తగిన పారితోషికం ఇవ్వకపోవడంతో చాలామంది ఇతర దేశాల్లోని లీగ్ ల వైపు వెళ్లిపోతున్నారు. సొంత జట్టుకి ఆడటం లేదు. దీంతో పురుషుల జట్టు ఎక్కడికెళ్లినా ఓటమిపాలై, పరువు పోగొట్టుకుని వస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఓటమి చవిచూసింది.
ఇంతకీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన మహిళా స్టార్ క్రీడాకారిణుల్లో అనిసా మొహమ్మద్, షకేరా సెల్మాన్, కైసియా నైట్, కిషోనా నైట్లు ఉన్నారు. కానీ వీరెందుకు రిటైర్మెంట్ సడన్ గా ప్రకటించారనేది చెప్పడం లేదు.