Japan Moon Landing : చంద్రుడిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా దించిన ఐదో దేశంగా జపాన్ చరిత్ర సృష్టించింది.జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. పిన్పాయింట్ టెక్నాలజీని ఉపయోగించి చంద్ర భూ మధ్య రేఖకు దక్షిణంగా ఉన్న బిలం వాలుపై ఇది ల్యాండ్ అయ్యింది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, భారత్లు మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత సాధించాయి. తాజాగా జాక్సా ప్రయోగం కూడా విజయవంతం కావడంతో..చంద్రుడిపై అడుగుపెట్టిన ఐదో దేశంగా జపాన్ చరిత్ర సృష్టించింది.
ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, భారత్ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించాయి. జపాన్కు చెందిన ‘స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్’ అనే ఈ వ్యోమనౌక.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల 50 నిమిషాలకు జాబిల్లిని తాకింది. నిర్దేశిత రీతిలో ఈ ప్రక్రియ సాఫీగా సాగిందా అన్నదానిపై తొలుత ఉత్కంఠ నెలకొంది. వ్యోమనౌకలోని లూనార్ ఎక్స్కర్షన్-1, 2 అనే రెండు రోవర్లు చందమామపై దిగాయని, వాటి నుంచి డేటా భూమికి అందుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ల్యాండర్లోని సౌరఫలకాల్లో ఇబ్బంది తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. అందువల్ల స్లిమ్.. ప్రస్తుతం బ్యాటరీలపైనే పనిచేస్తోందని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది పూర్తిస్థాయి విజయమేనా అన్నదానిపై మదింపు సాగుతోంది. గతేడాది సెప్టెంబర్ లో ‘స్లిమ్’ నింగిలోకి పయనమైంది. దీని ద్వారా సరికొత్త ల్యాండింగ్ పరిజ్ఞానాన్ని జపాన్ పరీక్షిస్తోంది. అనుకున్న ప్రాంతంలో అత్యంత కచ్చితత్వంతో దిగడానికి ఈ సాంకేతికత తోడ్పడుతుంది. ఈ టెక్నాలజీ సాఫీగా పనిచేసిందా, నిర్దేశిత ప్రాంతంలోనే వ్యోమనౌక దిగిందా అన్నది ఇంకా వెల్లడికాలేదు..