T20 World Cup 2024 : ఇన్నాళ్లూ ఒక్క క్రికెట్ తప్ప అన్ని ఆటల్లోనూ ఆసక్తి చూపించిన అమెరికా ప్రస్తుతం క్రికెట్ పై కూడా దృష్టి పెట్టింది. అది టైం వేస్ట్ గేమ్ అంటూ కామెంట్లు చేసి, ఇప్పుడు తామే టీ 20 ప్రపంచ కప్ నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
అంతా బాగానే ఉంది కానీ, అమెరికాలో సంప్రదాయ క్రికెట్ ఆడేందుకు అనువైన గ్రౌండ్స్ లేవు, అలాగే అక్కడున్న మట్టిపై పిచ్ తయారు చేయడం సాధ్యం కాదు. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం డ్రాప్ ఇన్ పిచ్ లను రెడీ చేస్తున్నారు. అది కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకువస్తున్నారు. డ్రాప్ ఇన్ పిచ్ లను తయారుచేయడంలో నిపుణుడైన ఆడిలైడ్ ఓవల్ క్యురేటర్ డామియన్ హోతో ఐసీసీ ఒప్పందం చేసుకుంది.
ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే టీ 20 మ్యాచ్ అమెరికాలోనే జరగనుంది. జూన్ 9న న్యూయార్క్ లోని నసావు మైదానంలో జరిగే ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం పిచ్ తయారీలో క్యూరేటర్ బృందం శ్రమిస్తోంది.
డ్రాప్ ఇన్ పిచ్ లను ఎలా చేస్తారంటే, ఒక ప్రత్యేకమైన ట్రేలలో పిచ్ మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. వాటిని కంటైనర్ల ద్వారా ఆస్ట్రేలియా నుంచి న్యూయార్క్ కు తీసుకురానున్నారు. అనంతరం ఆ ట్రేలను గ్రౌండ్ లో ఒక దగ్గర అమర్చి పిచ్ ను తయారు చేస్తారు. ఇది ఒకటే కాదు ప్రపంచ కప్ నిర్వహించే ఇతర గ్రౌండ్లలో కూడా ఇప్పటికే డ్రాప్ ఇన్ పిచ్ ల నిర్మాణం పూర్తయినట్టు ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ డైరక్టర్ క్రిస్ టెట్లీ తెలిపాడు.
న్యూయార్క్ లోని ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగే గ్రౌండ్ ను కూడా క్రికెట్ కి అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. వర్షం వచ్చినా నీరు నిలవకుండా ఉండేలా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మరో ఐదు నెలల్లో మెగా టోర్నీఆరంభం కానుంది. ఇప్పటి నుంచి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
భారత్-పాక్ మధ్య జరిగే గ్రౌండ్ లో కుర్చీలు కూడా లేవు. వాటిని లాస్ వేగాస్ లోని ఎఫ్-1 సర్క్యూట్ నుంచి అద్దెకు తీసుకువస్తున్నారు. స్టేడియం కెపాసిటీ 34వేలు కావడంతో అన్ని కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పీకడం, ఇక్కడికి తేవడం ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా, ఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
క్రికెట్ పై అమెరికా లాంటి అగ్రదేశం మనసు పెట్టిందంటే, ఖండాంతరాలను దాటి వ్యాపిస్తుందని, ఏ పది దేశాలకో క్రికెట్ పరిమితం కాదని, ఒలంపిక్స్ తో ధీటుగా ఉంటుందని నమ్ముతున్నారు. ఇదే జరిగితే రాబోవు పదేళ్లలో క్రికెట్ స్వరూపమే మారిపోనుంది. ఇక మనవాళ్లు పది దేశాలతో కాదు కనీసం వంద దేశాలతో పోటీ పడాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇంతకీ అమెరికా ఎందుకంత ఆసక్తి చూపిస్తుందంటే ఇండియాలో జరిగే ఐపీఎల్…అవెంత ప్రజాదారణ పొందాయో దానిద్వారా బీసీసీఐ బలమైన ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో చూసి, అమెరికా కూడా రంగంలోకి దిగిందని అంటున్నారు.