Amazon : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ఘట్టానికి సమయం దగ్గర పడుతోంది. ఆ అపూర్వ ఘడియల కోసం యావత్ దేశం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో అయోధ్య పేరుతో ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది.
తాజాగా ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఏకంగా అయోధ్య రాముడి పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వారం రోజులలోపు వివరణ ఇవ్వాలని కోరింది.
అయోధ్య ప్రసాదం పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్నారని దాఖలైన ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది. సాధారణ లడ్డూలను అయోధ్య అనే బ్రాండ్ వేసి అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్ పేడా ఇతర ఉత్పత్తులను అమెజాన్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సీసీపీఏకి ఫిర్యాదు చేయడంతో అమెజాన్ సంస్థకు నోటీసులు పంపించింది.