Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. రామనామ స్మరణతో దేశం మార్మోగుతోంది. దశాబ్దాలుగా హిందువులు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఇక ప్రతిష్టించబోయే విగ్రహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చలకు చెక్ పెడుతూ ఆలయ అధికారులు.. విగ్రహ ముఖాన్ని బహిర్గతం చేశారు.
5 ఏళ్ల వయస్సు కలిగిన బాల రాముడి విగ్రహాన్ని ప్రత్యేక రాయితో తయారు చేశారు. ఈ రాం లల్లా విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. దీని బరువు 1800 కిలోగ్రాముల బరువు ఉంటుంది. గురువారం విగ్రహాన్ని బయటకు చూపించినా.. ముఖాన్ని చూపించలేదు. అయితే, శుక్రవారం రాత్రి ముఖాన్ని కూడా చూపించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 22న ప్రతిష్ఠించబోయే రామ్ లల్లా విగ్రహం మహావిష్ణువు యొక్క 10 అవతారాలను చూపిస్తుంది. ఒక వైపు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామనుడు అవతారాలు కనిపించగా.. మరోవైపు పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి ఉన్నారు. ఇక విగ్రహంలో హనుమంతుడు, గరుడుడు కూడా ఉన్నారు. ఈ నెల 22న విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది.
ఈ కార్యక్రమానికి చాలా మందికి ఆహ్వానాలు వెళ్ళాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, యోగులు, రుషులు ఇలా చాలా మంది ఈ వేడుకకు హాజరుకానున్నారు. దాదాపుగా 8వేల మంది విశిష్ట అతిధులు ఈ కార్యక్రమానికి హాజరువుతారని అంచనా వేస్తున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని మోడీతో పాటూ వీవీఐపీలు హాజరవుతున్న కారణంగా అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య నగరాన్ని నిఘా నీడలో ఉంచారు. వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే అయోధ్యకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చేరుకుంది. విద్రోహశక్తుల ముప్పు నేపథ్యంలో యూపీ ఏటీఎస్, కమెండో బలగాలు మోహరించాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్లతో పాటు సైబర్ సెక్యూరిటీకి చెందిన విభాగాలు కూడా నిఘా పెట్టాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
రాం లల్లా విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22ను పబ్లిక్ హాలీడే ప్రకటించింది. ఇక ఆ తర్వాత.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, గోవా ప్రభుత్వాలు కూడా ఏక్ నాథ్ సిండే ప్రభుత్వాన్నే ఫాలో అయ్యాయి. అటు, కేంద్రం కూడా ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది.