KTR latest news(Political news in telangana):
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూట గట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ ఎఫెక్ట్ తోనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ నేతల్ని సమాయత్తం చేసే పనిలో పడ్డారు. కేసీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పలువురు సీనియర్లతో కలిసి పార్లమెంట్ వారీగా సమీక్షలు ఏర్పాటు చేస్తూ లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. అయితే బీఆర్ఎస్ లో ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు నా కంటే మల్లారెడ్డి ఎక్కువ ఫేమస్ అంటూ చెప్పుకొచ్చిన కేటీఆర్ కి ఇప్పుడు మల్లారెడ్డి శైలి తలనొప్పిలా మారిందని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో భూ కబ్జాల ఆరోపణలు, స్థానిక ఎన్నికల్లో టికెట్స్ అమ్ముకున్నారని డైరెక్ట్ ఆడియోలు బయటికి రావడంతో.. మల్లారెడ్డికి ఎన్నికల్లో పరాజయం తప్పదనుకున్నారు. కానీ తక్కువ మెజారిటీతో ఊహించని రీతిలో గట్టెక్కారు. ఎలక్షన్ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన మల్లారెడ్డి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ గోవా, దుబాయ్ లలో ఎంజాయ్ చేస్తూ ట్రిప్ లు వేయడం పట్ల పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గానే గోవా ట్రిప్ ముగించుకున్న మల్లారెడ్డి.. ప్రస్తుతం దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నేడు మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ను రేపటికి వాయిదా వేశారు. దీంతో మల్లారెడ్డి వ్యవహారంపై కేటీఆర్ కూడా ఆరా తీశారని సమాచారం అందుతుంది. ఆయన వైఖరిపై కేటీఆర్ సైతం గుస్సా అవుతున్నారని పార్టీలో ఇన్ సైడ్ టాక్ నడుస్తుంది. శనివారం సాయంత్రం మల్లారెడ్డి హైదరాబాద్ రానుండగా ఆదివారం జరగబోయే సమావేశం ఆసక్తిగా మారింది.