Mancherial : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం జాజులపేట గ్రామానికి చెందిన పూజిత (25) నిండు గర్భిణి. అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సిబ్బంది సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చింది. గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.
అది నీల్వాయి అటవీ ప్రాంతం. ముజమ్మిల్ ఏరియాలో వాహనాన్ని పక్కకు ఆపారు. (Emergency medical technician) ఈఎంటీ రమేష్ గర్భిణీకి సుఖ ప్రసవం చేశాడు. పూజిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అప్పుడే పుట్టిన శిశువుకు మెడలో బొడ్డు తాడు చుట్టి ఉండడం గమనించిన ఈఎంటి రమేష్ తనకున్న నైపుణ్యంతో డాక్టర్ సలహాతో శిశువు మెడ నుంచి బొడ్డు తాడును తొలగించాడు. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. ముందు జాగ్రత్తగా ఇద్దర్నీ చికిత్స కోసం చెన్నూర్ పిల్లల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.