Bihar : అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో మనం ఊహించలేం. బిహార్ లోని ఓ యువకుడికి అదృష్టం క్రికెట్ గేమ్ రూపంలో తలుపు తట్టింది. అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తుంటాడు. అతడు డ్రీమ్-11 యాప్లో ఫాంటసీ క్రికెట్ గేమ్ ఆడి ఏకంగా రూ.కోటిన్నర జాక్పాట్ కొట్టాడు.
సాదిఖ్ అనే యువకుడు స్థానికంగా ఓ ఏజెన్సీలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. క్రికెట్పై ఆసక్తి ఉన్న సాదిఖ్ జనవరి 14న జరిగిన భారత్-అఫ్గానిస్థాన్ టీ20 మ్యాచ్ సందర్భంగా రూ.49 పెట్టి డ్రీమ్-11లో గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్లో 974.5 పాయింట్లతో సాదిఖ్ తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. దీంతో సాదిఖ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.
తన వద్ద పనిచేసే వ్యక్తికి జాక్ పాట్ తగలడంపై గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర స్పందించారు. సాదిఖ్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగానే.. ఆ నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని వెల్లడించారు.