IND vs ENG First Test(Telangana news updates):
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఈ మ్యాచ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు కొత్తగా హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన రావు తెలిపారు. సీఎం దావోస్ పర్యటన నుంచి రాగానే వెళ్లి కలిసి ఆహ్వానిస్తామని తెలిపారు.
ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు తన మార్క్ చూపించాలని తహతహలాడుతున్నారు. ముందుగా స్టేడియంలో మరమ్మతులు, మార్పులు, చేర్పులు, విరిగిపోయిన కుర్చీలు, పైకప్పులు, టాయిలెట్స్, కలర్స్ వీటన్నింటిపై దృష్టి సారించారు. దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.
గత హెచ్సీఏ ప్యానెల్ లో అంతర్గత కుమ్ములాటలతో స్టేడియం నిర్వహణను గాలికి వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారి.. అంతర్జాతీయంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం పరువు పోయింది.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహనరావు మాట్లాడారు. ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ను కూడా రినోవేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అందరూ మ్యాచ్ చూడాలని, టెస్ట్ మ్యాచ్ లపై ఆసక్తి పెంచేందుకు టికెట్ ధరలు తగ్గించినట్టు తెలిపారు.
హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల విద్యార్థులకు 5వేల కాంప్లిమెంటరీ పాస్లు అందజేయనున్నామని, వారికి భోజన వసతి కూడా కల్పిస్తామని చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు.
జనవరి 23న హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్ లో బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం జరగనుందని కొత్త అధ్యక్షుడు జగన్మోహనరావు తెలిపారు. హెచ్సీఏ తరఫున ప్రముఖ క్రికెటర్లు సచిన్, గవాస్కర్, కపిల్ దేవ్, ధోనీ తదితరులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.