Proddatur news(Latest news in Andhra Pradesh):
ప్రొద్దుటూరులోని వ్యాపారసంస్థల్లో అధికారుల తనిఖీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బంగారు దుకాణాల వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యే అండగా నిలబడితే.. ఇదంతా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతకీ ప్రొద్దుటూరులో జరిగే బంగారం వ్యాపార లావాదేవీలేంటి.. వ్యాపారుల వెనకున్న నేతలెవరు? వ్యాపార సంస్థల్లో జరిగిన తనిఖీల్లోనూ టీడీపీ వర్సెస్ వైసీపీ అనే వాదన ఎలా వచ్చింది.
ప్రొద్దుటూరులో వ్యాపార సంస్థల్లో తనిఖీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు వ్యాపారుల అండ కోసం పరితపిస్తున్నాయి. పోలీసుల తనిఖీలను స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, టీడీపీ నేత వరదరాజులరెడ్డి.. రాజకీయాలకు వాడుకుంటున్నారే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటినుంచి వ్యాపారుల అండదండలతోనే రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నట్లు స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రొద్దుటూరులో వందల కోట్ల వ్యాపారం జరుగుతుండడంతో భారీగా పార్టీలకు విరాళాలు.. ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ కోణంలో వారిని దూరం చేసుకోకుండా దగ్గరయ్యేందుకు ఇరు పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి.
ఎన్నికల సమయం దగ్గర పడటంతో వారికి అండగా నిలవాలని అనే ఉద్దేశంతోనే రాజకీయ దుమారం రేగుతోంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎన్నికలకు వచ్చే ఫండింగ్ కోసమే అధికారుల తీరును స్థానిక ఎమ్మెల్యే తప్పుపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులోనే పోలీసులు ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశాలతో వ్యాపారులను, పేదలను తనిఖీలు చేస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఆరోపించారు. రాయలసీమలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరులో రోజూ వంద కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని.. ఇక్కడ పోలీసులు దాడులు చేస్తే వ్యాపారుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి.. ఈ దాడులను ప్రోత్సహించి సానుభూతి కోసం ధర్నా, నిరసనలు చేస్తున్నారని వరదరాజులరెడ్డి మండిపడ్డారు. అధికారపార్టీలో ఉండి ఎమ్మెల్యే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యాపారులను టార్గెట్ చేయించిందే ఎమ్మెల్యే అంటూ వరదరాజులరెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీసులంతా రాచమల్లుకు ఊడిగం చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తనిఖీలు ఎవరు చేయించారో పోలీసులే బయట పెట్టాలని వరదరాజుల రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ రాకుండానే తనిఖీలు ఎవరు చేయిస్తున్నారో వ్యాపారులకు కూడా తెలుసు అంటున్నారు వరదరాజుల రెడ్డి. ఎమ్మెల్యే రాచమల్లుతో అధికారులు కుమ్మక్కయ్యి.. డ్రామాలాడుతున్నారంటూ ఆరోపించారు. గతంలో సోదాలు జరిగినప్పుడు ఈ స్థాయిలో ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదనే టీడీపీ ప్రశ్నిస్తోంది. దీంతో ప్రొద్దుటూరులో బంగారం, వస్త్ర దుకాణాల వ్యాపారులు రెండుగా చీలిపోయారు. వ్యాపారులంతా తనవద్దకే రావాలని రాచమల్లు యత్నమని విమర్శిస్తున్నారు వరదరాజులరెడ్డి.
ఇటీవల కాలంలో టీడీపీ టికెట్ వరదరాజులరెడ్డికి వస్తుందనే వార్తలు నేపథ్యంలో ఆయనకు కొందరు వ్యాపారస్తులు సపోర్టుగా నిలుస్తున్నట్లు సమాచారం. వ్యాపారులను తనిఖీలతో భయపెట్టి.. టీడీపీకి దూరం చేయాలనే వైసీపీ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పసుపునేతలకు సపోర్ట్ చేసే వ్యాపారులను దూరం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారంటూ వరదరాజులరెడ్డి ఆరోపిస్తున్నారు. దాని పర్యవసానమే పోలీసుల ఆకస్మిక తనిఖీలని స్పష్టత ఇచ్చారు.
ప్రొద్దుటూరులో రెగ్యులర్గా పోలీసుల తనిఖీలు సాగుతుంటాయి. ముఖ్యంగా బంగారం దుకాణాలు ఉన్న ప్రాంతాలలో తనిఖీలు ఎక్కువగా ఉంటాయి. బంగారం వ్యాపారంలో రెండో ముంబాయిగా ప్రొద్దుటూరు పేరు సంపాదించింది. పట్టణ చెక్ పోస్టులలో కాకుండా వ్యాపార సముదాయం వద్ద తనిఖీలు చేస్తున్నారని వ్యాపారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు వారికి అండగా నిరసన వ్యక్తం చేశానంటున్నారు స్దానిక ఎమ్యెల్యే రాచమల్లు. వ్యాపారుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లికార్డులు చూపించినా.. తమను పోలీసులు వదలటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పోలీసుల చర్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతా ఎమ్మెల్యే రాచమల్లు.. వ్యాపారులకు హామీ ఇచ్చారు.
ప్రొద్దుటూరులో ప్రతిరోజూ వందల కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వందల సంఖ్యలో హోల్ సేల్ వ్యాపారం సాగుతుంది. వేల సంఖ్యలో బంగారం దుకాణంలో కార్మికులు పనులు చేస్తున్నారు. బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు రాయలసీమ వాసులు ఇక్కడకు వస్తున్నారు. కడప, చిత్తూరు, కర్నూలు , అనంతపురం, ప్రకాశం , నెల్లూరు ప్రాంతాల వారు ఇక్కడికి వస్తున్న వ్యాపారులు.. బంగారం కొనుగోలు చేస్తుంటారు. హ్యాండ్ మేడ్ బంగారు ఆభరణాలకు ప్రొద్దుటూరు ప్రసిద్ది. GST కానీ.. టాక్స్ కానీ చెల్లించకుండా బంగారం కొనుగోలు చేయవచ్చనే ఉద్దేశంతో ఇతరప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు వస్తారు. పెళ్లిళ్లు సహా ఇతర ఏ శుభకార్యక్రమాలు ఉన్నా.. ఇక్కడే బంగారం కొంటారు. ఇదంతా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలోని జరుగుతుందనేది వరదరాజులరెడ్డి ఆరోపణ. చూడాలి.. దుకాణాల్లో తనిఖీల రాజకీయాలు.. భవిష్యత్లో మరెన్ని మలుపులు తిరుగుతాయో.
.
.