MS Dhoni Fan Suicide : మహేంద్ర సింగ్ ధోనీ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న వీరాభిమాని ఒకరు సడన్ గా ఆత్మహత్య చేసుకున్నాడు. ధోనీ అంటే అతనికి చచ్చేటంత ఇష్టం. అదెంత ఇష్టమంటే తన ఇంటి గోడలపై మొత్తం ధోనీ ఫొటోలతో నింపేశాడు. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ పసుపు రంగుని ఇంటికి వేశాడు. అలా తన ఇంటికి ‘హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్’ అని నామకరణం చేశాడు.
తమిళనాడులో కడలూర్ జిల్లా అరంగూర్ లో ఉండే ఆ అభిమాని పేరు గోపికృష్ణన్. 2020లో తన కొత్త ఇంటి గృహప్రవేశం చేశాడు. అప్పుడీ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విషయం తెలిసి ధోనీ ఎంతో సంతోషించాడు. అంతేకాదు ఆ కుటుంబాన్ని సన్మానించాడు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ అంతటి వీరాభిమాని సడన్ గా గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపికృష్ణన్కు భార్య అన్భరసి, కిషోర్, శక్తివేల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 10 రోజుల క్రితమే ఓ పాప కూడా పుట్టింది. ఇంతలోనే ఇలా జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ గ్రామం పేరుని ప్రపంచానికి తెలియజేసిన గోపికృష్ణన్ ఇలా చేసి ఉండకూడదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. విషయం ముందే చెబితే ఏదో రకంగా సెటిల్ చేసేవారమని అంటున్నారు.
ఆర్థిక లావాదేవీలే ఆ అభిమాని బలవన్మరణానికి కారణమని అంటున్నారు. డబ్బు విషయంలో పక్క గ్రామానికి చెందిన కొందరు గోపికృష్ణన్పై దాడి చేసినట్లు అతడి సోదరుడు రామనాథన్ తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురై తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
భార్య, ముగ్గురి పిల్లలని అనాధలుగా వదిలేసిన గోపీకృష్ణన్ సమాచారం తెలిసి ధోనీ ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆ పదిరోజుల పాపతో, ఇద్దరి పిల్లలతో ఆ భార్య, ఆ కుటుంబాన్ని ఎలా ఈదగలదని అక్కడ చేరినవారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధోనీ క్రికెట్ లో ప్రవేశించినప్పటి నుంచి గోపీకృష్ణన్ తన జీవితమంతా అతని నామస్మరణలోనే గడిపాడని స్నేహితులు తెలిపారు.