China Lithium : చైనా పంట పండింది. పది లక్షల టన్నుల లిథియం నిక్షేపాలు బయటపడ్డాయి. తెల్ల బంగారం, కొత్త చమురు అని ముద్దుగా పిలుచుకునే ఈ క్షార లోహం నిల్వలు సిచువాన్ ప్రావిన్స్లోని యాజియాంగ్ కౌంటీలో గుర్తించినట్టు డ్రాగన్ దేశం ప్రకటించింది. విద్యుత్తు వాహనాల బ్యాటరీల్లో వినియోగించేది ఈ మెటల్నే. లిథియం తాజా నిల్వల కారణంగా చైనా పురోగతి మరింత వేగం పుంజుకోగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
లిథియం కోసం ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్నాయి. లిథియం ఐయాన్ బ్యాటరీల కారణంగా కర్బన ఉద్గారాలను పెద్ద మొత్తంలో కట్టడి కాగలవు. అందుకే లిథియం విలువ బంగారాన్ని మించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా బయటపడిన నిల్వల్లో ఇప్పటికే చైనా 7 శాతం వాటాతో ఆరోస్థానంలో ఉంది. బొలీవియా, అర్జెంటీనా, అమెరికా, చిలీ, ఆస్ట్రేలియా టాప్ ఫైవ్ దేశాలుగా నిలిచాయి.
అయితే లిథియాన్ని శుద్ధి చేయడంలో మాత్రం చైనాదే అగ్రస్థానం. ప్రపంచంలోని మొత్తం లిథియంలో సగానికి పైగా ఇక్కడే రిఫైన్ అవుతుంది. ఈవీ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చైనాలోని లిథియంతో అవసరాలు తీరడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఈవీ బ్యాటరీల్లో 70 శాతం చైనావే. దీంతో లిథియం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. నిరుడు చైనా లిథియం, సోలార్ బ్యాటరీలు, ఈవీల ఎగుమతుల విలువ 139 బిలియన్ డాలర్లకు చేరింది.
లిథియం నిక్షేపాల విషయంలో థాయ్లాండ్ నుంచి చైనాకు గట్టిపోటీ ఎదురవుతోంది. 1.48 కోట్ల టన్నుల లిథియం నిల్వలను గుర్తించినట్టు ఇటీవల థాయ్లాండ్ వెల్లడించింది. బొలీవియాలోని లిథియం నిల్వల్లో 64 శాతానికి ఇది సమానం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా లిథియం నిల్వలు ఉన్నది బొలీవియాలోనే. నిరుడు మన దేశంలోనూ భారీ మొత్తంలో లిథియం నిల్వలు బయటపడ్డాయి. నిరుడుజమ్మూకశ్మీర్లో 50 లక్షల టన్నుల నిక్షేపాలను గుర్తించిన సంగతి తెలిసిందే.