Rakshana Nidhi : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఇంచార్జీల నియామకం అలజడి రేపుతోంది. వైసీపీ తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టారు. తిరువూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జీ రక్షణ నిధి స్థానంలో స్వామిదాస్ ను నియమించారు. దీంతో తీవ్ర అసహానికి గురయిన రక్షణనిధి పార్టీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఆయన టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు.
వైసీపీ అధిష్టానం మరోసారి తిరువూరు సీటు ఇవ్వకపోవడంతో తన మనసు ఎంతో గాయపడిందని రక్షణ నిధి అన్నారు. ఓ ఎంపీ చెప్పిన మాట విని తనను పక్కనబెట్టారు. కొంత కాలంగా తనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయని అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారమే తిరువూరు టికెట్ తనకు రాకుండా చేశారని అన్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని బలోపేతం చేసిన తనను గుర్తించకుండా ఎంపీ మాటలు విని సీటు ఇవ్వలేదని రక్షణనిధి అన్నారు. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. ఎక్కడి నుంచి అనేది త్వరలో తెలియజేస్తానన్నారు. పదేళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లను తాను దూషించిన సందర్భాలు లేవు. టికెట్ ఇవ్వకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చని భావిస్తున్నానని అన్నారు.