Bilkis Bano Case : బిల్కిస్బానో కేసు( Bilkis Bano case)లో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లొంగిపోవడానికి మరింత సమయం కావాలంటూ వారు వేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. వాటికి విచారణార్హత లేదని, ఆదివారం నాటికి వారంతా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు అదేశాలు జారి చేసింది.
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు.. బిల్కిస్ బానో ఐదు నెలల గర్భిణిగా ఉన్నారు. ఆ సమయంలో బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఈ కేసులో 11 మంది దోషులు 15 ఏళ్లు జైల్లో గడిపారు. దోషులకు గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. దీంతో 2023 ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు.
సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. దోషుల విడుదల చెల్లదని జనవరి 8న తీర్పునిచ్చింది. వారంతా రెండు వారాల్లో జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. అయితే, తమకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని, లొంగిపోయేందుకు మరింత సమయం కావాలంటూ వారు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.