Ayodhya : అయోధ్య నగరం నిఘా నీడలో ఉంది. ప్రాణ ప్రతిష్ఠకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జనవరి 22న అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోదీ చేతుల మీదుగా వైభవంగా జరగనుంది. దీని కోసం ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు వెళ్లాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు ఇలా చాలా మంది ఈ వేడుకకు హాజరుకానున్నారు.
దాదాపుగా 8 వేల మంది విశిష్ట అతిధులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని మోదీతోపాటు వీవీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో కారణంగా అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
ప్రధాని రాక సందర్భంగా అయోధ్యకు ముందే చేరుకుంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. విద్రోహశక్తుల ముప్పు నేపథ్యంలో యూపీ ఏటీఎస్, కమెండో బలగాలు మోహరించాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్లతోపాటు సైబర్ సెక్యూరిటీకి చెందిన విభాగాలు మోహరించాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. జపాన్, అమెరికా దేశాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక భద్రత వ్యవస్థను అయోధ్యలో నెలకొల్పింది యూపీ ప్రభుత్వం.
రామాలయ ప్రాంగణ పరిసరాల్లో 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతోపాటు మరో 319 ఫేషియల్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శత్రుదుర్భేద్యంగా మారాయి ఆలయ పరిసర ప్రాంతాలు. ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గురువారం ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను అదుపులోకి తీసుకుంది యూపీ ఏటీఎస్.