Munugode : రోడ్ రోలర్, చపాతీ మేకర్. ఈ పేర్లు వింటే చాలు కారు పార్టీ ఉలిక్కిపడుతుంది. ఈవీఎంలలో ఈ గుర్తులు.. కారును పోలి ఉండటంతో.. ఇటు పడాల్సిన ఓట్లు అటు పడతాయనేది టీఆర్ఎస్ భయం. అన్నట్టుగానే గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారు పార్టీ ఓట్లను చెప్పుకోదగ్గ సంఖ్యలోనే చీల్చాయి ఆ రెండు గుర్తులు. ఈసారి మునుగోడులో టఫ్ ఫైట్ ఉండటంతో.. గులాబీ దళాన్ని రోడ్ రోలర్, చపాతీ మేకర్ తెగ టెన్షన్ పెట్టాయి.
కారు గుర్తు మాదిరే ఉండే ఆ రెండు గుర్తులు వద్దంటూ పోలింగ్ కు ముందు టీఆర్ఎస్ గట్టి ఫైటే చేసింది. ఈసీకి ఫిర్యాదు చేసింది, హైకోర్టులో కేసు వేసింది. అయినా, ప్రయోజనం లేకుండా పోయింది. కావాలనే గతంలోనే రద్దు చేసిన ఆ సింబల్స్ ను మళ్లీ తీసుకొచ్చారని అధికార పార్టీ పదే పదే ఆరోపించింది. ముందుజాగ్రత్తగా ఓటర్లలో అవేర్ నెస్ క్రియేట్ చేసింది. డమ్మీ ఈవీఎంలు ప్రజలకు చూపిస్తూ.. కారు గుర్తు ఎక్కడుందో సూచిస్తూ.. రోడ్ రోలర్, రోటీ మేకర్ లకు ఓటు వేయకుండా వివరించింది. అయినా, ఈసారి కూడా కారు పార్టీ ఓట్లకు బాగానే గండి పెట్టాయి ఆ రెండు గుర్తులు.
టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ జస్ట్ 10 వేలు మాత్రమేనంటూ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మా మెజార్టీ తగ్గడానికి రోడ్ రోలర్, రోటీ మేకర్లే కారణమన్నారు కేటీఆర్. ఆ రెండు గుర్తులకు దాదాపు 6 వేల ఓట్లు వచ్చాయని.. ఆ ఓట్లన్నీ మావేనంటూ మండిపడ్డారు.
అబ్బో ఆరు వేల ఓట్లే. చాల పెద్ద సంఖ్యే. ప్రతీ ఓటు విలువైన ఉప ఎన్నికలో.. ఏకంగా 6 వేల ఓట్లు రోడ్ రోలర్, రోటీ మేకర్లకు పడ్డాయంటే.. వాటి నుంచి కారు పార్టీకి ఇప్పట్లో కష్టాలు తప్పేలా లేదు. మెజార్టీ 10వేలు దాటేసింది కాబట్టి సరిపోయింది.. అదే దుబ్బాక మాదిరి బొటాబొటి ఆధిక్యం వచ్చి ఉంటే? టీఆర్ఎస్ కు భారీ డ్యామేజే జరిగుండేదని అంటున్నారు.