YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు బయల్దేరతారు. శనివారం సాయంత్రం 4 గంటలకు YSR ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఆదివారం కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు PCC చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారానికి ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్, మయప్పన్తో పాటు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు.
PCC చీఫ్ పదవితో షర్మిల యాక్టివ్ అవుతున్నారు. సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా గతంలో తన తండ్రి వైఎస్తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వైఎస్ మృతి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పలువురు నేతలతో ఫోన్లో చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా కలిసి మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ల సహకారం, సూచనలు ఎంతో అవసరమని భావిస్తున్న షర్మిల.. కడప జిల్లాలో సైలెంట్గా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నారు.