Nagarkurnool : సంక్రాంతి పండుగకు కుమార్తె వద్దకు వెళ్లిన వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్కి చెందిన నాగమ్మ(60) అనే వృద్ధురాలుకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కొడుకుల వద్ద ఉన్న ఆమె సంక్రాంతికి వంగూరు మండలం ఉల్పరలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లేందుకు మంగళవారం కల్వకుర్తికి వెళ్లింది. బస్సు కోసం బస్టాండులో వేచి ఉండగా గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను వెంట తీసుకెళ్లాడు. నాగమ్మ రాత్రయినా కుమార్తె ఇంటికి చేరుకోపోవడంతో మరుసటి రోజు అంతా వెతికినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు బుధవారం పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు.
పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. అందులో నిక్షిప్తమైన దృశ్యాలతో నిందితున్ని గుర్తించారు. అనుమానితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. అచ్చంపేట సమీపంలో నల్లమల అడవుల్లో మృతదేహాన్ని పడేసి గుర్తుపట్టకుండా నిప్పటించాడు.
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలాంటి మరో కేసులోనూ నిందితునిపై అనుమానాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.