Nara Chandrababu Naidu : టీడీపీ, జనసేన గెలుపు అన్స్టాపబుల్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవం నినాదంతో తెలుగువారి సత్తాను చూపిన వ్యక్తి పుట్టిన గడ్డ గుడివాడ అని ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అంటే తెలుగు పౌరుషం, ఆత్మగౌరవం, సంక్షేమమని వివరించారు.గుడివాడ అంటే మహానుభావులు పుట్టిన గడ్డ అని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వ పాలనపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై రూ.4 లక్షల భారం పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆదాయం పెంచి ఆదుకునే సరైన ప్రభుత్వం రావాలన్నారు. జగన్ వస్తే పోలవరం ఆగిపోతుందని ఆనాడే చెప్పానని గుర్తుచేశారు. వైసీపీ పాలనలో వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ఆరోపించారు. 30 బీసీ, 27 ఎస్సీ, మైనార్టీ పథకాలు రద్దు చేశారని తెలిపారు.
దేశంలో అత్యంత ధనిక సీఎం వైఎస్ జగన్ అని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చేది భూ రక్షణ చట్టం కాదు.. భూ భక్షణ చట్టం అని విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక భూ రక్షణ చట్టం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు, చీకటి జీవోలను వెబ్సైట్లో దాచిపెట్టిందన్నారు.
అంతుకుముందు ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులోనూ చంద్రబాబు పర్యటించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి గ్రామంలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టోలో పెట్టిన ‘పూర్ టు రిచ్’ కాన్సెప్ట్ను ఆవిష్కరించారు. ఈ పథకంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు.