Badvel TDP Politics | బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బద్వేలు టీడీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. అక్కడ గత మూడు ఎన్నికల నుంచి పార్టీ అభ్యర్ధులు మారిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కేండెట్లను బరిలోకి దింపుతున్న టీడీపీ అధిష్టానంపై లీడర్లు భగ్గమంటున్నారు. ఉన్నత ఉద్యోగాలు చేసుకొనే తమకు రాజకీయాలపై ఆశ కల్పించి. .
Badvel TDP Politics | బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బద్వేలు టీడీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. అక్కడ గత మూడు ఎన్నికల నుంచి పార్టీ అభ్యర్ధులు మారిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కేండెట్లను బరిలోకి దింపుతున్న టీడీపీ అధిష్టానంపై లీడర్లు భగ్గమంటున్నారు. ఉన్నత ఉద్యోగాలు చేసుకొనే తమకు రాజకీయాలపై ఆశ కల్పించి. . కూరలో కరివేపాకులా పక్కన పెట్టేస్తున్నారని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రస్తుత పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ రాజశేఖర్ను మార్చి కొత్త నేతను నియమించడంతో అసంతృప్తి తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది .
కడప జిల్లా బద్వేలు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి అక్కడ గట్టి పట్టు ఉండేది. అయితే 2004 ఎన్నికల నాటి నుంచి సీన్ మారిపోయింది. టీడీపీ వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఆ సెగ్మెంట్ కాంగ్రెస్ ఖాతాలకి.. ఆ తర్వాత వైసీపీ ఎకౌంట్లోకి వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడక్కడ టీడీపీ ఉనికి చాటుకునే పనిలో పడింది. బద్వేలులో తెలుగుదేశానికి క్యాడర్ విషయంలో కొదవలేకపోయినా .. నడిపించే నాయకుడే కరువయ్యారు.
బద్దేలు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి మరణంతో 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే టీడీపీకి ఆ నియోజకవర్గంలో ఆఖరి విజయం. 2004లో పోటీ చేసిన విజయమ్మ పరాజయం పాలయ్యారు. తర్వాత 2009 ఎన్నికల నాటికి బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అయినప్పటికీ ఆమే అక్కడ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటి నుంచి టీడీపీ ఎన్నికకో అభ్యర్థిని మారుస్తుండటంపై కేడర్ రగిలిపోతోంది.
టిడిపికి బద్వేలులో బలమైన అభ్యర్ధులు ఉన్నా.. విజయమ్మ ప్రమేయంతోనే అభ్యర్ధులను మారుస్తూ .. వారి జీవితాలతో అడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగాలను వదులుకుని పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తే .. కూరలో కరివేపాకులా పడేస్తున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 2009లో చెన్నయ్య అనే నేత తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పార్టీ ఆయన్ని పట్టించుకున్న పాపాన పోలేదంట.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున బ్యాంకు ఉద్యోగిని విజయజ్యోతి జాబ్ వదులుకుని పార్టీలో చేరి.. పోటీ చేస్తే ఓటిపోయాక పక్కన పెట్టేశారు. దాంతో అమె అటు ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని, ఇటు రాజకీయాల్లో ఇమడలేక రెంటికి చెడ్డ రేవడిలా మారారట. 2019లో డాక్టర్ రాజశేఖర్ అనే కొత్త అభ్యర్ధిని టీడీపీ తెరపైకి తెచ్చింది. అయన కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన్నికాదని ఇంకో కొత్త ముఖాన్ని అభ్యర్ధిగా పోటీ చేయించే పనిలో పడ్డారంట విజయమ్మ.
నంద్యాల జిల్లాలో జలవనరుల శాఖలో పనిచేస్తున్న రోషన్న అనే అధికారి పేరు టీడీపీ ఖరారు చేసిందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ రాజశేఖర్ తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా అయనను ఏ మాత్రం పట్టించుకోకుండా రోషన్నను అభ్యర్ధిగా ప్రకటించే పనిలో ఉన్నారంట టిడిపి పెద్దలు. వాస్తవానికి బద్వేలు టీడీపీ వ్యవహారాలపై పెత్తనం చేస్తున్నమాజీ ఎమ్మెల్యే విజయమ్మ, అమె కొడుకు రితేష్రెడ్డిలు అక్కడ పార్ట్ టైం పాలిటిక్స్ నడుపుతూ.. నియోజకవర్గానికి, క్యాడర్ కు దూరంగా ఉంటారంట.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డాక్టర్ రాజశేఖర్ మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. అలాంటాయన్ని ఈ సారి పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతుండటంపై కేడర్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరిగ్గా ఎన్నికల ముందు ఎవరెవరినో తీసుకొచ్చి.. అభ్యర్ధిగా ప్రకటించడం ఏంటని పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవల విజయమ్మ వ్యవహార తీరుని నిరసిస్తూ నియోజకవర్గంలోని పలువురు నేతలు మీటింగ్ పెట్టుకుని.. ఎలా పడితే అలా అభ్యర్ధులను మార్చడమేంటని ప్రశ్నించారు.
వారంతా అధిష్టానంతోనే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారన్న టాక్ నడుస్తోంది. ఏదిఎమైనా బద్వేలులో పార్టీ బలోపేతానికి కృషి చేసి .. ప్రజలకు దగ్గరైన డాక్టర్ రాజశేఖర్ కు మరో అవకాశం ఇవ్వాలని.. లేనిపక్ష్యంలో పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తామని హెచ్చరిస్తుండటం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. మరి బద్వేలు కేండెట్ విషయంలో చంద్రబాబు, లోకేశ్లు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.