Double Super Over Rules : ఇండియా- అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. టైగా ముగిసిన ఈ మ్యాచ్ విజేత ఎవరో డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో డబుల్ సూపర్ ఓవర్ జరగడం ఇదే తొలిసారి. ఇరు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది . దీంతో మ్యాచ్ సూపర్ కు వెళ్లింది. తొలి సూపర్ ఓవర్ లో మందుగా బ్యాటింగ్ చేసి అఫ్గానిస్తాన్ 16 పరుగులు చేసింది. ఛేదనలో ఇండియా 16 పరుగులు చేయడంతో మళ్లీ మ్యాచ్ టై అయ్యింది. దీంతో అంపైర్లు రెండో సూపర్ ఓవర్ ఆడించారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన రెండో సూపర్ ఓవర్లో ఇండియా విజయం సాధించింది.
అసలు రెండు సూపర్ ఓవర్లు ఎందుకు..?
2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత బౌండరీ కౌంట్ నిబంధనను తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు సూపర్ ఓవర్లను ఆడించే నిబంధనను తీసుకొచ్చారు. డబుల్ సూపర్ ఓవర్ నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం..
రెండో సూపర్ ఓవర్ బౌలింగ్ నిబంధనలివే..!
మొదటి సూపర్ ఓవర్ వేసిన బౌలర్ కు రెండోసారి బౌలింగ్ చేసే అవకాశం లేదు. అందుకే బుధవారం జరిగిన మ్యాచ్లో అఫ్గానిస్తాన్ నుంచి అజ్మతుల్లా ఒమర్జాయ్ , భారత్ నుంచి ముఖేష్ కుమార్ వేశారు. అందుకే రెండో సూపర్ ఓవర్ వేసే అవకాశం వారికి దక్కలేదు. రెండో సూపర్ లో అఫ్గానిస్తాన్ ఫరీద్ అహ్మద్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అతడు ఒక సిక్సర్, ఫోర్ ఇచ్చిన తర్వాత తేరుకుని ఇండియాను 11 పరుగులకే పరిమితం చేశాడు. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ ఒక్క పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది. మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి భారత్ ను విజయతీరాలకు చేర్చిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు.
రెండో సూపర్ ఓవర్ లో ఎవరు ముందుగా బ్యాటింగ్ చేయాలి?
తొలి సూపర్ ఓవర్ లో ఛేజింగ్ చేసిన జట్టే తర్వాతి సూపర్ ఓవర్లో తొలి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సూపర్ ఓవర్ మాదిరిగానే రెండో ఓవర్ కు కూడా ఇదే నియమం వర్తిస్తుంది.నిర్ణీత 20 ఓవర్లలో ఛేజింగ్ చేసిన జట్టు సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. భారత్ నిర్దేశించిన 212/4 స్కోరును 212/6తో సమం చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తొలి సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసింది. భారత్ రెండో సూపర్ ఓవర్ తొలి ఇన్నింగ్స్ ఆడాటానికి కారణం కూడా ఇదే. మొదటి సూపర్ ఓవర్లో చివరగా బ్యాటింగ్ చేసిన జట్టు రెండో సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. మొత్తానికి సూపర్ ఓవర్ల విషయానికి వస్తే ఏ జట్టు కూడా బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేయడం లేదా ఛేజింగ్ చేయడం జరగదు.
రెండో సూపర్ ఓవర్ బ్యాటింగ్ రూల్స్..!
ఎంసీసీ నిబంధనల ప్రకారం తొలి సూపర్ ఓవర్లో ఔటైన బ్యాటర్ రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయకూడదు. సూపర్ ఓవర్ ప్రారంభమయ్యే కంటే ముందు ఇరు జట్లు తాము ఎంచుకున్న బ్యాటర్ల జాబితాను ఖరారు చేసుకుంటాయి. ఒక బ్యాటర్లు మొదటి సూపర్ ఓవర్ కు లిస్ట్ చేయబడి, బ్యాటింగ్ చేయకపోయినా.. అవుట్ కాకపోయినా, అతను రెండో సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేయడానికి వీలుంటుంది. అదేవిధంగా, బ్యాటర్ రిటైర్డ్ హర్ట్ అయితే రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయగలడు. రిటైర్డ్ అవుట్ అయితే మాత్రం బ్యాటింగ్ కు అవకాశం ఉండదు.
తొలి సూపర్ ఓవర్ లో అజేయంగా నిలిచిన యశస్వి జైస్వాల్ మరోసారి ఆడే అవకాశం ఉన్నా.. సంజూ శాంసన్ వైపు భారత్ వ్యూహాత్మకంగా మొగ్గుచూపింది. ఎడమచేతి వాటం ఓపెనర్ జైస్వాల్ మొదటి సూపర్ ఓవర్లో అజేయంగా నిలిచాడు. కానీ రోహిత్ స్థానంలో వచ్చిన తర్వాత మొదటి సూపర్ ఓవర్లో నాటౌట్గా నిలిచిన రింకూ సింగ్ రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేశాడు. రోహిత్ ఎందుకు బ్యాటింగ్ చేశాడనే దానిపై ఇంకా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్డ్ అవుట్కు, రిటైర్డ్ హర్ట్కు తేడా ఉంది. ఒక బ్యాటర్ రిటైర్డ్ హర్ట్ అయితే మళ్లీ రెండో సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు అవకాశం ఉంటుంది. రిటైర్డ్ అవుట్ అయితే మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. బుధవారం జరిగిన మ్యాచ్లో తొలి సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అందుకే రెండో సూపర్ ఓవర్లో హిట్ మ్యాన్ మళ్లీ బ్యాటింగ్ చేశాడు
రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే ఎలా?
రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే.. మూడో సూపర్ ఓవర్ ఆడుతారు. విజేతను తేలే వరకు ఇది కొనసాగుతుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు ఆడించారు. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో తొలిసారి రెండు సూపర్ ఓవర్లు జరిగాయి . ప్రపంచం ఇంకా ట్రిపుల్ సూపర్ ఓవర్ చూడలేదు. తర్వలోనే అది చూస్తామేమో…