Indian Navy : అమెరికా కంటైనర్ నౌక ‘గల్ఫ్ ఆఫ్ ఎడెన్’లో డ్రోన్ దాడికి గురయ్యింది. ఈ నౌకకు భారత యుద్ధ నౌక ‘INS విశాఖపట్నం’ సాయం చేసింది.
Indian Navy : అమెరికా కంటైనర్ నౌక ‘గల్ఫ్ ఆఫ్ ఎడెన్’ డ్రోన్ దాడికి గురయ్యింది. ఈ నౌకకు భారత యుద్ధ నౌక ‘INS విశాఖపట్నం’ సాయం చేసింది.
అమెరికాకు చెందిన ‘జెన్కో పికార్డీ’ అనే కంటైనర్ నౌకను లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ప్రయాణిస్తున్న ఈ నౌకపై డ్రోన్తో బాంబులు జారవిడిచారు. దీంతో కొంతభాగం ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న భారత నౌకాదళం తక్షణమే స్పందించింది. దానికి సమీపంలోనే విధులు నిర్వర్తిస్తున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం(INS Visakhapatnam)ను ఘటనా స్థలానికి పంపించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ‘ఎంవీ జెన్కో పికార్డీ’ నౌకపై బుధవారం రాత్రి 11.11 గంటల సమయంలో డ్రోన్ దాడి జరిగింది. సాయం కావాలని దాని నుంచి అభ్యర్థన వచ్చింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో యాంటీ-పైరసీ ఆపరేషన్లో ఉన్న ఇండియా డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే స్పందించింది. అర్ధరాత్రి తర్వాత జెన్కో పికార్డీ నౌక వద్దకు చేరుకుని మన నౌక సాయం అందించిందని నౌకాదళం ఎక్స్ ఖాతాలో తెలిపింది.
దాడి సమయంలో అమెరికా నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారని, 9 మంది భారతీయులు ఉన్నారని నేవి తెలిపింది. ఘటనలో వీరికి ఎలాంటి హనీ జరగలేదని, మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలియజేసింది. ప్రస్తుతం నౌక సురక్షితంగా ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టిందని పేర్కొంది.
గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి నిరసనగా హౌతీలు ఈ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా నౌకలనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. అటు అగ్రరాజ్యం కూడా రక్షణ చర్యలకు దిగింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై క్షిపణి, వైమానిక దాడులు జరుపుతోంది.