Global Risks : ఈ ఏడాది ప్రపంచం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉంది? మితిమీరుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న జీవన వ్యయం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, మూడో ప్రపంచ యుద్దం.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సమస్యలు, సవాళ్లు. 2024 ఎన్నికల సంవత్సరం. మునుపెన్నడూ లేని రీతిలో 60 దేశాల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. 400 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొంటారు. ప్రపంచ దేశాల్లో దాదాపు మూడొంతుల దేశాలు ఎన్నికలను నిర్వహించుకుంటున్న నేపథ్యంలో సమాచార నిరాకరణ, తప్పుడు సమాచారం ముప్పు కూడా పొంచే ఉంటుంది.
అసలు ఈ ఏడాదిలో గ్లోబల్ ఎకానమీ(Global Economy)ని దెబ్బతీసే ప్రధాన రిస్క్లు ఏమిటన్నవీ 1490 మంది నేతలను సర్వే చేసి మరీ తెలుసుకుంది ప్రపంచ ఆర్థిక వేదిక. పర్యావరణ మార్పులే మానవాళికి ప్రధాన సమస్య అని 66% మంది కుండబద్దలు కొట్టారు. ఇక ఎన్నికల సంవత్సరంలో తప్పుడు సమాచారం పెద్ద ముప్పుగా నిలవనుంది. ప్రజలకు సమాచారం చేరకుండా ప్రభుత్వాలు తొక్కి పెట్టడం మరో ముప్పు. ప్రజలు ఎదుర్కోవాల్సిన అసలు సిసలు సమస్యలు ఈ రెండేనని 53% మంది చెప్పారు.
ఇక సొసైటల్ పోలరైజేషన్ మూడో రిస్క్గా నిలిచింది. ఈ ఏడాది సమాజంలో స్పష్టమైన విభజన రేఖ(ఉదాహరణకు.. ధనిక-పేద వర్గాల నడుమ) కనిపించడం ఖాయమని 46% తేల్చి చెప్పారు. జీవన వ్యయ సంక్షోభాన్ని ప్రపంచం చవిచూస్తుందని 42%, సైబర్ దాడులతో పెను నష్టం తప్పదని 39% అభిప్రాయపడ్డారు. దేశాల మధ్య సాయుధ ఘర్షణలు మరింత ముదురుతాయని 25 శాతం, ఆహార సరఫరా గొలుసు(Food Supply Chain)కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని 18 శాతం మంది స్పష్టం చేశారు.