Rohit Sharma : ఇప్పటికే టీమ్ ఇండియా రెండు టీ 20లు వరుసగా గెలిచింది. సిరీస్ కూడా సొంతమైంది. ఇక ఆఫ్గాన్ తో మూడో టీ 20పై అంత ఇంట్రస్ట్ లేదని చాలామంది అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆఫ్గాన్ జట్టు కూడా పెద్ద పోరాటపటిమ చూపించడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. టీవీల దగ్గర కూడా ఎవరూ లేరనే నెట్టింట కామెంట్లు వచ్చాయి.
అందుకు తగినట్టుగానే టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో ఆ చూసేవాళ్లు కూడా చాలామంది లేచి వెళ్లిపోయారు. కానీ అప్పుడు వచ్చాడు… వీరుడు రింకూసింగ్.. తను పరుగులు చేస్తూనే కెప్టెన్ రోహిత్ శర్మకి మరో ఎండ్ లో సహకారం అందించాడు. ఆ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది. రోహిత్ శర్మ 121 నాటౌట్, రింకూసింగ్ 69 నాటౌట్ ఇద్దరూ ఆఫ్గాన్ బౌలర్లకి చాకిరేవు పెట్టి వదిలారు.
ఈ క్రమంలో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఫరీద్ అహ్మద్ వేసిన తొలి బంతికి జైశ్వాల్ ఆఫ్ సైడ్ దిశగా షాట్ ఆడి మూడు పరుగులు చేశాడు. మరుసటి బంతి రోహిత్ బ్యాట్ అంచును తాకింది.. ఆ తర్వాత ప్యాడ్లను తాకుతూ బౌండరీ లైన్కు వెళ్లింది.
అంపైర్ లెగ్ బైస్ ఇచ్చాడు. రోహిత్ శర్మ సరేనని ఇబ్బందిగా తలఊపాడు. అదే ఓవర్ ఐదో బంతి కూడా అదే పద్ధతిలో వెళ్లింది. అయితే అది రోహిత్ తొడను తాకింది. అలా ఆ బంతి కూడా బౌండరీ చేరింది. అలా జట్టు ఖాతాలో 11 పరుగులు చేరాయి.. కానీ రోహిత్ ఖాతాలో చూస్తే సున్నా పరుగులే ఉన్నాయి. అప్పటికే 5 బంతులు ఆడేశాడు.
మరుసటి ఓవర్లో అంపైర్ వీరేందర్ శర్మ వైపు రోహిత్ చేరాడు. ఇదే విషయాన్నితనతో ప్రస్తావించాడు. ‘అరే.. వీరూ భయ్… మొదటి బాల్ నా థైస్ కి తగల్లేదు.. అని తొడలను టచ్ చేసి చూపించాడు. అలాగే బ్యాట్ ని పట్టుకుని చూపిస్తూ, ఇక్కడ ఎడ్జ్ కి తగిలిందని వివరించాడు. తర్వాత నవ్వుతూ ఇప్పటికే ఇక్కడ రెండు డక్లున్నాయి.. తెలుసా?’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. అంపైర్తో రోహిత్ ఇలా మాట్లాడటం చూసి కామెంటేటర్ల వ్యాఖ్యానంతో మ్యాచ్ చూసేవాళ్ల ముఖాల్లో నవ్వులు విరిశాయి.